విద్యార్థుల ఆగ్రహం బాబు చవిచూడక తప్పదు | YSRCP Leader Pardhasaradhi Says Chandrababu Should Face BC Students Anger | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆగ్రహం బాబు చవిచూడక తప్పదు

Jul 3 2018 7:40 PM | Updated on Jul 3 2018 8:06 PM

YSRCP Leader Pardhasaradhi Says Chandrababu Should Face BC Students Anger - Sakshi

విజయవాడ: టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రిజర్వేషన్‌ విద్యార్థులు నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే సరిదిద్దకపోతే బీసీ విద్యార్థుల ఆగ్రహం చవిచూడక తప్పదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి హెచ్చరించారు. మంగళవారం విజయవాడలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్ధసారథి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ అధికారులు ప్రవర్తిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ప్రభుత్వ నిర్వాకం వల్ల బలహీన వర్గాలకు చెందిన వందలాది విద్యార్థులు మెడికల్‌ సీట్లు కోల్పోయారని వ్యాఖ్యానించారు.

బలహీన వర్గాలకు టీడీపీ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోందని విమర్శించారు. గత సంవత్సరం వరకు కూడా రీజియన్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయించి ఆయా కేటగిరీ విద్యార్థులకు సీట్లు కేటాయించేవారని తెలిపారు. మనకు ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనే రెండు రీజియన్లు ఉన్నాయని, వాటి పరిధిలో 1500ల మెడికల్‌ సీట్లు ఉన్నాయని వివరించారు. రిజర్వేషన్‌ కోటా ప్రకారం బీసీ-డీకి 7 శాతం, బీసీ-సీకి ఒక శాతం సీట్లు రిజర్వు చేయటం జరిగిందని, ఈ లెక్క ప్రకారం రెండు కేటగిరీలలోని బీసీ విద్యార్థులకు 120 సీట్లు రావాలని అన్నారు.

కానీ 10 సీట్లు మాత్రమే వచ్చాయని..దీనికి కారణం కాలేజీని యూనిట్‌గా తీసుకోవడమేనని చెప్పారు. ఓపెన్‌ కేటగిరీలో సీట్లు సంపాదించిన బీసీ విద్యార్థులను కూడా రిజర్వేషన్‌ కింద పరిగణించడం వల్లే బీసీ విద్యార్థులు నష్టపోయారని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులను పురమాయించి తప్పును దిద్దాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement