‘చంద్రబాబు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు’ | YSRCP Leader Malladi Vishnu Slams Chandrababu | Sakshi
Sakshi News home page

ఆ మాట నీ నోటి వెంట పలకడానికి అర్హుడవా? : జోగి రమేష్‌

Sep 11 2019 1:56 PM | Updated on Sep 11 2019 2:13 PM

YSRCP Leader Malladi Vishnu Slams Chandrababu - Sakshi

ఈ క్షణం మీ ఇంటి దగ్గరికి వస్తాం... నీ ఇష్టం... గురజాల, సత్తెనపల్లి... ఎక్కడికైనా..

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఏపీ రాజకీయాలను డ్రామాలు, సినిమాలుగా మార్చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 100 రోజుల పరిపాలనలో ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఆ మాటలు మాట్లాడే అర్హత నీకుందా అంటూ చంద్రబాబుని ప్రశ్నించారు. బుధవారం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఛలో ఆత్మకూరు కాదు.. ఛలో నరసరావుపేట, ఛలో యరపతినేని మైనింగ్ అనాలి. దెయ్యాలు వేదాలు వళ్లించినట్లు ఉన్నాయి నీ మాటలు. ప్రభుత్వం సాగర్‌కి నీళ్లు ఇస్తే.. రైతులు పొలాలు వేసుకుంటుంటే.. పచ్చని పల్నాడులో చిచ్చు రేపుతోంది నువ్వు చంద్రబాబు. ప్రజల చేత తిరస్కరించబడ్డ నేతలు ఇప్పుడు బాబు పక్కన చేరి ఏదేదో మాట్లాడుతున్నారు. మీ ఐదేళ్ల పరిపాలనలో మీరు చేసిన హత్యలు, అరాచకాల జాబితా మా దగ్గర ఉంది. అక్రమ కట్టడంలో ఉండి అక్రమ మాటలు మాట్లాడుతున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఆ మాట నీ నోటి వెంట పలకడానికి అర్హుడవా? : జోగి రమేష్‌
ప్రజాస్వామ్యం అనే మాట నీ నోటి వెంట పలకడానికి అర్హుడవా అంటూ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిని ప్రశ్నించారు.  పల్నాడులో శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేయడానికి చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  ‘‘ చంద్రబాబు 12 గంటల దీక్ష చేస్తారట. ఆయన ఏమి చేస్తాడనేది జనం పట్టించుకోవడం లేదు. టీడీపీ అధికారంలోకి రాగానే 30 మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారు. వేల మందిని నిర్భందించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ 100 రోజుల పరిపాలనలో ఏ ఒక్క వ్యక్తికి ఇబ్బంది కలగలేదు. 

మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈ డ్రామాలు. ఈ క్షణం మీ ఇంటి దగ్గరికి వస్తాం... నీ ఇష్టం... గురజాల, సత్తెనపల్లి... ఎక్కడికైనా నీతోనే వస్తాం. మా సవాల్‌ను స్వీకరించండి. మీడియా సాక్షిగా మీరెక్కడికి చెప్తే అక్కడికి వెళదాం. యరపతినేని వందల కోట్ల ప్రజాధనాన్ని గనుల పేరుతో లూటీ చేశారు. గాలిని పోగేయడంలో చంద్రబాబును మించిన వారు లేరు. ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంటే ఏదో జరిగిపోతుందని హడావుడి చేస్తున్నారు. ఆత్మకూరులో ఏముంది ? ఆత్మకూరు.. పల్నాడు ప్రశాంతంగా ఉన్నాయి. నువ్వే శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నావు’’ అంటూ మండిపడ్డారు.

పెయిడ్‌ ఆర్టిస్టులతో కొత్త డ్రామాలకు తెర: దాడిశెట్టి రాజా
తూర్పు గోదావరి : ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆత్మకూరు పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని, పెయిడ్‌ ఆర్టిస్టులతో కొత్త డ్రామాలకు తెర తీశారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాడిశెట్టి రాజా విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తునిలో జరిగిన కాపు గర్జన రైలు దగ్ధం కేసుల్లో వైఎస్సార్‌ సీపీకి చెందిన 140 మందిపై అక్రమ కేసులు బనాయించారన్నారు. కాపు గర్జన కేసుల్లో ఎస్సీలు, బీసీలు, మైనారిటీలపై కూడా చంద్రబాబు కేసులు బనాయించారని తెలిపారు. నేర చరిత్ర కలిగిన చంద్రబాబునాయుడు ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అసమర్ధ పాలన చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో 23 సీట్లు ఇచ్చి బుద్ది చెప్పారన్నారు. ఇదే పంధాలో కొనసాగేతే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 5 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement