అలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం దారుణం : వైఎస్‌ షర్మిల

YS Sharmila Criticize Chandrababu Naidu Government - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఇసుక తనిఖీలకు వెళ్లిన ఎమ్మార్వో వనజాక్షిని జుట్టు పట్టుకొని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లిన చింతమనేని ప్రభాకర్‌కు మళ్లీ ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వడం దారుణమని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిల అన్నారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా నడిపల్లిలో మత్స్యకారులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మత్స్యకారులు చింతమనేని అక్రమాలతో పాటు కొల్లేరు సమస్యలను వైఎస్ షర్మిల వద్ద ఏకరువు పెట్టుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో చింతమనేని ప్రభాకర్‌కు గట్టిగా బుద్ది చెప్పాలని కోరారు. 38 రౌడీషీట్‌  కేసులున్న చింతమనేనిని ఓడిస్తే .. అతనికి బుద్ది వచ్చేట్లు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేస్తారన్నారు. చింతమనేని అక్రమాలకు చంద్రబాబే కారణం అని ఆరోపించారు. చింతమనేని దుర్మార్గాలు ఒక్కొక్కటిగా చెబుతుంటే అతను మనిషేనా అని అనిపిస్తోందన్నారు.అధికారంలోకి వచ్చిన తర్వాత చింతమనేని అక్రమాలపై చర్యలు తీసుకునే బాధ్యత తమదని హామీ ఇచ్చారు. యధారాజా తధాప్రజా అన్నట్లుగా చంద్రబాబు అలా ఉన్నాడు కాబట్టే చింతమనేని ఇలా రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఇలాంటి రౌడీలకు చంద్రబాబు టికెట్‌ ఇవ్వడం దారుణమన్నారు.

కొల్లేరు సమస్యను జగనన్న పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. జగనన్న అధికారంలోకి వస్తే కొల్లేరును రీసర్వే చేసి మీకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. వైఎస్‌ జగన్‌ నవరత్నాలతో అందరి జీవితాలలో వెలుగులు నింపుతారని హామీ ఇచ్చారు. పిల్లలను బడికి పంపిస్తే చాలు ఏడాదికి 15 వేలు జగనన్న ఇస్తారని భరోసా ఇచ్చారు. వృద్దుల పెన్షన్ ను రెండు వేల నుంచి మూడు వేలకి పెంచుతారన్నారు. ప్రతీ ఒక్కరి కష్టాలు తీరాలంటే ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top