రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకే : వైఎస్‌ జగన్‌ | Ys Jagan Says Rajahmundry Mp Seat Will be Given To Bc | Sakshi
Sakshi News home page

Jun 10 2018 7:20 PM | Updated on Jul 26 2018 7:17 PM

Ys Jagan Says Rajahmundry Mp Seat Will be Given To Bc - Sakshi

సాక్షి, మల్లవరం ( పశ్చిమగోదావరి ) : రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకే కేటాయిస్తామని ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. 185వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మల్లవరంలో ఆయన బీసీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..  ‘ప్రతిజిల్లాలోను ఆనవాయితీగా బీసీల, ఎస్సీ, ఎస్టీల ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు మాట్లాడితే అభివృద్ది అంటాడు. నాకు తెలిసినంతవరకు అభివృద్ది అంటే నిన్నటి కంటే నేడు బాగుండటం. మరీ బాబు పాలనలో నిన్నటి కన్నా నేడు బాగున్నామా?

ఎన్నికలంటేనే బీసీలు గుర్తొస్తారు..
బీసీల మీద ప్రేమ అంటాడు.. ప్రస్తుతం ఈయన పోటీ చేస్తున్న నియోజక వర్గం కుప్పం.. ఇక్కడ బీసీలు ఎక్కువగా ఉంటారు. ఆయన సొంతూరూ చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. ఈ తరం పిల్లలకు ఆయన గురించి తెలియదు కాబట్టి చెబుతున్నా.. చంద్రబాబు నాయుడు 1972లో చంద్రగిరి నుంచి తొలి సారి పోటీచేశారు. 2,494 ఓట్లతో గెలిచారు. చంద్రబాబుకు నాన్నగారికి ఉన్న స్నేహం గురించి తెలిసిందే. ఆయన దయతో మంత్రి కూడా అయ్యారు. కాంగ్రెస్‌ హయాంలో మంత్రి అయి..మామ పెట్టిన పార్టీకి వ్యతిరేకంగా 1983లో చంద్రగిరి నుంచి మరోసారి పోటీ చేశారు. మంత్రిగా ఉండి పోటీ చేస్తే ఎవరైనా గెలుస్తారు. కానీ ఈయన 17,400 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉండి దివంగత నేత ఎన్టీఆర్‌ కూతురును పెళ్లి చేసుకున్నాడు. ఓడినా కూడా నా అల్లుడే అని ఆ పెద్దాయన దగ్గరికి తీశారు. ఆ తరువాత ఏమైందో అందరికి తెలిసిందే. చివరకు ఆయనను దగ్గరికి ఎందుకు తీసానా అని ఎన్డీఆరే బాధపడ్డారు. 1985లో వచ్చిన ఎన్నికల్లో ఈ పెద్దాయన పోటీ చేయలేదు. 1989లో కుప్పం నుంచి పోటీ చేశారు. ఇక్కడ అత్యధిక ఓటర్లు ఎవరంటే బీసీలు. ఈయన ఓసీ.. చేతనైతే ఓసీ నియోజకవర్గాల్లో పోటీ పడాలి. కానీ ఈయన సొంత నియోజకవర్గం నుంచి కాకుండా బీసీలు ఎక్కువగా ఉన్న కుప్పం నుంచి పోటీ చేసి 5వేల ఓట్లతో గెలిచారు. ఈయనకు ఎప్పుడు బీసీల మీద ప్రేమ ఉండదు. ఎన్నికల్లో ఎలా వాడుకోవాలనే తప్ప వారి మంచి గురించి ఆలోచించే సమయమే ఉండదు. 

బీసీలు జడ్జీలు కాకుండా..
బీసీలు జడ్జీలు కాకుండా ఈ పెద్ద మనిషి అడ్డుకున్నాడని ఇటీవల  హైకోర్టు రిటైర్డ్‌ జడ్జీ ఈశ్వరయ్య ప్రెస్‌ మీట్‌ పెట్టాడు. ఆ ప్రెస్‌ మీట్‌లో బీసీలను జడ్జీలు కాకుండా బాబు రాసిన ఓ లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇక మన కర్మ ఏంటంటే ఒక్క సాక్షిల తప్ప ఈ వార్తా ఎక్కడా రాలేదు. అంత అద్భుతంగా చంద్రబాబు మీడియాను మేనేజ్‌చేస్తున్నారు. 

20 శాతం కూడా ఖర్చు చేయలేదు..
ఎన్నికల ప్రణాళికలో బీసీలకు 110 వాగ్థానాలు కురిపించాడు. ప్రతి ఏటా బీసీల సంక్షేమం కోసం రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తానన్నాడు. తీరా కేటాయించింది. 2014-2015లో రూ. 2200 కోట్లు, 2015-16 రూ. 2573 కోట్లు,2016-17 రూ. 4500 కోట్లు, 2017-18 రూ. 4700 కోట్లు ఇలా మెత్తం రూ. 17, 300 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈయన చెప్పిన దాంట్లో ఇది కేవలం 20 శాతమే. ఇదే బీసీలపై ప్రేమ అంటాడు. నారయణ, శ్రీ చెతన్యల మేలుకోసం సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లు ఏడా పెడా మూసేశాడు. ఆయన చేతుల్లో లేకున్నా రజకులను ఎస్సీల్లో, కురమ, వాల్మీకీ, బోయలను ఎస్టీలుగా గుర్తించుటకు చర్యలు తీసుకుంటానని ఓట్ల కోసం తప్పుడు వాగ్ధానాలు చేశారు. మత్స్యకారులను ఎస్టీలన్నాడు. తన చేతిలో లేని అంశమని తెలుసు. అయినా ఓట్ల కోసం ఇలా చెప్పాడు. ఇప్పుడేమో నాదేముంది కేంద్రం సహకరించలేదంటున్నాడు.

పేదవాడు అనేవాడు పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తాడంటే.. ఆ ఇంటి నుంచి ఒక్క డాక్టర్‌, ఇంజనీర్‌, ​కలెక్టర్‌లు వచ్చినప్పుడేనని నాన్న గారు.. ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి నాతో చెప్పేవాడు. ఫీజురీయింబర్స్‌మెంట్‌తో పేదలకు ఆ దివంగత నేత భరోసా ఇచ్చాడు. దేశంలో కూడా ఎక్కడ లేని విధంగా ఈ పథకంతో చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం ఈ పథకాన్ని బాబు దారుణంగా నాశనం చేస్తున్నాడు. 

ఎన్నికలప్పుడు కేజీ నుంచి పీజీ వరకు అని చెప్పాడు. ఇప్పుడేమో ఇంజీనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల ఫీజుల పెంచేలా చూస్తాడు. లక్షల్లో ఫీజు ఉంటే ముప్పై వేలే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుందని విద్యార్థులు నాతో ఆవేదన చెందుతున్నారు. అప్పు చేసి మరి చదివే దారుణ పరిస్థితిని తీసుకొచ్చారు. మళ్లీ బీసీలు ఈ పెద్దమనిషికి ఎన్నికలప్పుడు గుర్తొస్తారు. నాలుగు కత్తేరలు అంటూ స్కీమ్‌లు తీసుకొస్తారు. వాళ్లు బాగా చదివి ఉన్నత స్థానాల్లో ఉండాలని ఆయన ఎప్పుడూ కోరుకోరు.

నవరత్నాలతో బీసీలకు..
దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రతి పేదవాడికి, బీసీలకు నవరత్నాల ద్వారా మేలు చేస్తాం. ఫీజురీయింబర్స్‌ మెంట్‌ను ప్రస్తుత పరిస్థితి నుంచి పూర్తిగా మార్చేస్తాం. వైఎస్సార్‌ స్వర్ణయుగాన్ని తీసుకొస్తాం. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకేస్తే వైఎస్‌ జగన్‌ వారికోసం రెండు అడుగులు ముందు కేస్తారని తెలియజేస్తున్నా. ఏ పెద్ద చదువులైనా.. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా చదివిస్తా. ఫీజులు పూర్తిగా ఇవ్వడమే కాకుండా.. వారి హస్టళ్లు, మెస్‌చార్జీల కోసం ప్రతి విద్యార్థికి ఏడాది రూ.20 వేల రూపాయిలిస్తామని హామీ ఇస్తున్నాను. రూపాయి ఖర్చు చేయకుండా పెద్ద చదువుల చదివేలా చేస్తా. బడికి పంపించిన ప్రతీ తల్లికి ఏడాదికి రూ.15 వేలిస్తాం. 2011 జనాభా లెక్కల ప్రకారం 32 శాతం మందికి చదువు రాదు. వీరంతా చదువలేని స్థితిలో ఉన్నారు కాబట్టి.. ఈ పథకం తీసుకొస్తున్నాను. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చదువు రాని వారు లేకుండా చేస్తాం. 

ఖర్చులు పెరుగుతున్నాయి కానీ.. పెన్షన్‌లు పెరగడం లేదు. అడక్కపోయినా కాంట్రాక్టర్లకు మాత్రం ఈ పెద్దమనిషి రేట్లు పెంచుతాడు. వీటిలో లంచాలు నొక్కుతాడు. అవ్వతాతాల పెన్షన్‌లు పెంచడు. తాము అధికారంలోకి వస్తే వెయ్యి రూపాయల పెన్షన్‌ను రెండు వేలకు పెంచుతాం. ఎస్సీ,బీసీ, మైనార్టీలకు పెన్షన్‌ వయసు 45 ఏళ్లకే తగ్గిస్తాం. ఈ విధంగా ప్రతీ బీసీ సోదరుడికి వైఎస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుంది.’ అని ఇంకా సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే ఇవ్వాలని  ప్రజలను వైఎస్‌ జగన్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement