సాక్షి, తిరుపతి: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కోటి సంతకాల ఉద్యమం గురించి మాట్లాడుతూ ఇటువంటి ప్రజా పోరాటాన్ని మొట్టమొదటి సారిగా రాష్ట్రం చూస్తోందని రోజా అన్నారు. కూటమి ప్రభుత్వం నియంతృత్వ పాలన, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కొనసాగిస్తోందని ఆరోపించారు. అందుకే వాటిని అడ్డుకునేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఈ పిలుపునిచ్చారని పేర్కొన్నారు.
ప్రజల్లో అసహనం పెరిగిపోతుందని, ఇది తిరుగుబాటుకు నాందిగా మారిందని రోజా వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తైనా కూటమి ప్రభుత్వం ఏ మాత్రం అభివృద్ధి తీసుకురాలేదు. అందుకే ప్రజలు విసుగుతో సంతకాల ఉద్యమానికి ముందుకొస్తున్నారు.
ఎన్నికలకు ముందు పోర్టులు, మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం దోచుకోవడం దాచుకోవడమే వారి పనిగా చేసుకుంటున్నారని రోజా విమర్శించారు.
జగన్ పాలనలో 17 మెడికల్ కాలేజీలలో 7 పూర్తయ్యాయి. మిగతావి ప్రారంభ దశలో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం కావాలనే వాటిని నిలిపివేసిందని రోజా ఆరోపించారు. గాడిద పాలు కడవెడు ఉన్నా,గంగిగోవుపాలు గరిటెడు చాలు అన్న చందంగా చంద్రబాబు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేకపోయింది.
రెండు లక్షల అరవైవేల కోట్లు అప్పులు చేసిన నీకు, నాలుగు వేల కోట్లతో హైదరాబాద్ కట్టిన వాడికి నాలుగువేల కోట్లు లేవా. ఈరోజు మెడికల్ కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నావు అంటూ చంద్రబాబును ఆమె ప్రశ్నించారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమీషన్లు ఇస్తామంటే బినామీలకు అంటగట్టే పనిలో కూటమి నేతలు ఉన్నారు. జగన్ నిర్మించిన మెడికల్ కాలేజీలు మీరు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు? ఇంకా నిస్సిగ్గుగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు చెంపపెట్టు అవుతుందని రోజా మండిపడ్డారు.


