
సాక్షి, చిత్తూరు : విశ్వసనీయత అన్న పదానికి చంద్రబాబు నాయుడు పాతర వేశారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు కొడతారేమో అనే భయంతో ఎన్నికల మ్యానిఫెస్టోను టీడీపీ తన పార్టీ వెబ్సైట్ నుంచి తీసేసిందని ఆయన అన్నారు. విశ్వసనీయత అనే పదాన్ని రాజకీయ నేతలు మర్చిపోయారని, మాట తప్పితే రాజీనామా చేసి ఇంటికి పోయే రోజు రావాలని అన్నారు.
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన సోమవారం చిత్తూరు జిల్లా చిన్నతిప్ప సముద్రంలో ప్రసంగించారు. 'నాలుగేళ్ల చంద్రబాబు పాలన చూసిన తర్వాత సంతోషంగా ఎవరైనా ఉన్నారా? రైతులు, చేనేతలు, అక్కా చెల్లెమ్మలు, విద్యార్థులు, అవ్వాతాతలు ఎవరూ సంతోషంగా లేరు. చేనేతలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ప్రతి కులాన్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా ఆయన మోసం చేశారు.
చేనేత కార్మికులకు ఒక్కటైనా మంచి జరిగిందా?వారికి రుణమాఫీ అయిందా అని అడుగుతున్నా. చేనేత కార్మికులకు బడ్జెట్లో రూ.1000 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లాకో చేనేత పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారు. రుణమాఫీ విషయంలో అదే జరిగింది. రుణాలు కట్టలేదని బ్యాంకులు వడ్డీ మీద వడ్డీలను వేస్తున్నాయి. చంద్రబాబు వల్ల మంచి జరిగేది కూడా జరక్కుండా పోయింది.
చేనేత కార్మికులు 35మంది చనిపోతే కనీసం 10మందికి కూడా రూ.5 లక్షలు ఇవ్వలేదు. ఏవిధంగా చేనేతలను చంద్రబాబు ఆదుకున్నాడో తెలియదు. బీసీలపై నిజమైన ప్రేమ చూపింది కేవలం వైఎస్ఆర్ మాత్రమే. చంద్రబాబు ముష్టి వేసినట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అదికూడా సరిగా ఇంజనీరింగ్ విద్యార్థులకు అందడం లేదు.
వైఎస్ఆర్ ఒక అడుగు ముందుకేస్తే.. ఆయన కొడుకుగా నేను మరో రెండడుగులు ముందుకేస్తా. ప్రతి పేద కుటుంబానికి తోడుగా ఉండి, ప్రతి విద్యార్థిని ఉచితంగా పెద్ద చదువులు చదివించే బాధ్యత నాది. మీ పిల్లలను బడికి పంపితే.. ప్రతి తల్లికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఎంత ఖర్చైనా మేం భరిస్తాం. డాక్టర్లు, ఇంజినీర్లను చేస్తాం. ఫీజులు లక్షల్లో ఉన్నా కడతాం. చదివించడమే కాదు.హాస్టల్ ఖర్చులకు రూ.20వేలు కూడా ఇస్తాం. వైఎస్ఆర్ సీపీ ప్రకటించిన నవరత్నాలలో ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి. వాటిని మరింతగా మెరుగు దిద్ది ముందుకు వెళదాం.' అని అన్నారు.