
సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తి.. నేడు వారి గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. ‘ధరల స్థిరీకరణ నిధి నీ హయాంలో లేదు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తివి ఇప్పుడు వాటి గురించి మాట్లాడటానికి సిగ్గనిపించడం లేదా బాబూ? ప్రతి గింజ కొనుగోలు చేస్తామని సిఎం జగన్ గారు హామీ ఇచ్చారు. పంట కోతలు యదావిధిగా జరగాలని ఆదేశించారు. రైతు నష్టపోకుండా చూసే పూచీ ప్రభుత్వానిది’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
‘14 ఏళ్లు సిఎంగా ఉండి నువ్వు కట్టించిన కోల్డ్ స్టోరేజి కేంద్రాలెన్నీ చంద్రబాబూ? రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నావు? రాష్ట్రంలో రైతులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు ఎవరూ ఆకలితో బాధపడే పరిస్థితి లేదు. కరువు జాడ నీతోనే పోయింది. ఇంకెప్పుడూ రావద్దని ప్రజలు కోరుకుంటున్నారు’ అని మరో ట్వీట్ చేశారు.
‘హుదూద్, తిత్లీ తుఫాన్లను డీల్ చేశా అని కటింగులిస్తున్నాడు. తుఫాను పోయిన నాలుగు రోజుల తర్వాత కూడా మంచినీళ్లు అందించలేని పాలన నీది. వందల ట్యాంకర్లు సరఫరా చేసినట్టు బిల్లులు మింగారు. శ్రీకాకుళంలో బస్సు వద్దకు బాధితులు వచ్చి నిలదీస్తే, ఏయ్ మీదే వూరని గద్దించింది నువు కాదా?’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.