నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష | Uddhav Thackeray may face floor test in Maharashtra Assembly | Sakshi
Sakshi News home page

నేడు ఠాక్రే విశ్వాస పరీక్ష

Nov 30 2019 3:16 AM | Updated on Nov 30 2019 8:12 AM

Uddhav Thackeray may face floor test in Maharashtra Assembly - Sakshi

శుక్రవారం తన ఛాంబర్‌లో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి ‘మహా వికాస్‌ ఆఘాడి’ తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు డిసెంబర్‌ 3 వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే సిద్ధమయ్యారు. నవంబర్‌ 30 మధ్యాహ్నం అసెంబ్లీ ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుందని అసెంబ్లీ అధికారులు వెల్లడించారు.

కాగా, ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్‌ వాల్సే పాటిల్‌ను కొత్త ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఫడ్నవీస్‌ ప్రభుత్వం నియమించిన ప్రొటెం స్పీకర్‌ కాళిదాసు కొలాంబ్కర్‌ స్థానంలో పాటిల్‌కు బాధ్యతలు అప్పగించారు. ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన దిలీప్‌ పాటిల్‌ గతంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే శుక్రవారం లాంఛనంగా అధికార బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 స్థానాలు గెలుచుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 సీట్లలో మెజారిటీకి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్య 145. ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ 105 స్థానాల్లో గెలుపొందింది.

రాజకీయ, రాజ్యాంగ నైతికతలు వేరువేరు: సుప్రీంకోర్టు
ఇతర రాజకీయ పక్షాలతో పొత్తుపెట్టుకోవడం పార్టీల హక్కు అని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యంలో పార్టీలకున్న ఆ హక్కును తొలగించలేమని వ్యాఖ్యానించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ ఎన్నికల అనంతరం జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. రాజకీయ నైతికత, రాజ్యాంగ నైతికత వేర్వేరని, వాటిని పోల్చలేమని జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

శివసేన, బీజేపీ ఎన్డీయే భాగస్వామ్యులుగా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేశాయని పిటిషన్‌దారు అఖిల భారత హిందూ మహాసభ తరఫు న్యాయవాది బీకే సిన్హా తెలిపారు. ప్రత్యర్థులుగా పోటీ చేసిన వారితో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సరికాదని ఆయన వాదించగా తమ పరిధిలోకి రాని ఎన్నికల అనంతర పొత్తుల్లోకి లాగవద్దని దర్మాసనం తెలిపింది. మేనిఫెస్టోలను అమలు చేయాలంటూ పార్టీలను కోర్టులు ఆదేశించలేవని కూడా పేర్కొంది.  

మహారాష్ట్ర తరువాత గోవానే!
మహారాష్ట్ర తరువాత తమ తదుపరి లక్ష్యం గోవాయేనని శివసేన నేత సంజయ్‌ రౌత్‌ ప్రకటించారు. గోవాలో కూడా బీజేపీయేతర సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. మహారాష్ట్రవాది గోమంతక్‌ పార్టీ(ఎంజీపీ), గోవా ఫార్వర్డ్‌ పార్టీ(జీఎఫ్‌పీ) నేతలతో శుక్రవారం రౌత్‌ చర్చలు జరిపారు.
పైన పేర్కొన్న రెండు పార్టీలు కూడా గతంలో బీజేపీ మిత్రపక్షాలే కావడం విశేషం. జీఎఫ్‌పీ చీఫ్‌ విజయ్‌ సర్దేశాయితో భేటీ అనంతరం రౌత్‌ మాట్లాడుతూ.. ‘త్వరలో పెద్ద భూకంపం రానుంది. సర్దేశాయి తన ఎమ్మెల్యేలతో ఇక్కడే ఉన్నారు. గోవాలో బీజేపీకి మద్దతిస్తున్న మరి కొందరు ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్‌లో ఉన్నారు’ అని పేర్కొన్నారు. ‘మహారాష్ట్ర తరువాత గోవానే. ఆ తరువాత వేరే రాష్ట్రాలపై దృష్టి పెడతాం’ అని రౌత్‌ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement