తెలంగాణ.. కల్వకుంట్ల సామ్రాజ్యమా?

Telangana Congress Leaders Slams KCR Governance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమని కాంగ్రెస్‌ నేత కుసుం కుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమా లేక కల్వకుంట్ల సామ్రాజ్యామా అంటూ ‍ప్రశ్నించారు. తాలీబన్‌ వ్యవస్థలా తెలంగాణను పాలిస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ధ్వజమెత్తారు. మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుసుమ కుమార్‌ పాల్గొన్నారు.  పోలింగ్‌ బూతుల్లో టీఆర్‌ఎస్‌కు ఏజెంట్లు అవసరం ఉండకపోవచ్చని.. అధికారులనే పోలింగ్‌ ఏజెంట్లుగా టీఆర్‌ఎస్‌ వాడుకునే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ చేతుల్లో తోలుబొమ్మల్లా ఉండొద్దని పోలీసులను హెచ్చరించారు. 

కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయం
సీఎం కేసీఆర్‌ ఈ ఎన్నికల్లో గెలవకుంటే జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్‌ రావ్‌ జోస్యం చెప్పారు. మంగళవారం ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. సహారా సంస్థ ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్‌) నిధులు వాడుకునేందుకూ అప్పటి కేంద్ర మంత్రి కేసీఆర్‌ అనుమతిచ్చారని.. దీంతో సహారా సంస్థ మూతపడిన తర్వాత పదకొండు లక్షల ఉద్యోగులు రోడ్డునపడ్డారని ధ్వజమెత్తారు.   

దీనిపై ఇప్పటికే కేసీఆర్‌ను సీబీఐ రెండు సార్లు విచారించిందన్నారు. ఈ కేసుకు భయపడే ప్రధాని నరేం‍ద్ర మోదీకి కేసీఆర్‌ సరెండర్‌ అయ్యారని విమర్శించారు. సీబీఐ కేసులో లేనని కేసీఆర్‌ నిరూపిస్తే.. ఆయన ఫామ్‌హౌస్‌ ముందు కాపలా కుక్కలా ఉంటానని సవాల్‌ విసిరారు. తెలంగాణలో ప్రజాకూటమి రావడం ఖాయమని, కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతోందని జోస్యం చెప్పారు. 
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top