వైఎస్సార్‌ సీపీలోకి చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

TDP Leaders Joins YSR Congress Party - Sakshi

సాక్షి, విశాఖపట్నం: పలు పార్టీల నుంచి వైఎస్సార్‌సీపీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలన మెచ్చి వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా భారీసంఖ్యలో వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. స్థానిక ఎన్నికల ముందు ఈ చేరికలు పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తాజాగా విశాఖ నార్త్‌ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి, మంత్రి కన్నబాబు, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమక్షంలో టీడీపీకి చెందిన పలువురు నేతలు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే గురుమూర్తి రెడ్డి, మాజీ  కార్పొరేటర్‌ పిఎల్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌, టీఎస్‌ఎన్‌ మూర్తి, రజక సంఘం నార్త్‌ అధ్యక్షుడు సత్యనారాయణ పార్టీలోకి చేరారు. వారికి ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. (వలసలతో టీడీపీ కుదేలు..)

ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి
జీవీఎంసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం అని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విశాఖను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌తో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని తెలిపారు. విశాఖను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. విశాఖ నుంచి భోగాపురం వరకు మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పురుషోత్తమపట్నం నుంచి విశాఖకు తాగునీటి కోసం పైప్‌లైన్‌ వేస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. 

ఆదర్శ పాలన చేస్తున్నారు: మంత్రి కన్నబాబు
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదర్శ పాలన అందిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం జగన్‌ బీసీలకు వెన్నుముకగా ఉన్నారని తెలిపారు. ఏలూరు డిక్లరేషన్‌ను అమలు చేసి చూపించారని కన్నబాబు పేర్కొన్నారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top