370 రద్దు వల్లే కశ్మీర్లో భారీ పోలింగ్‌ | Sakshi
Sakshi News home page

370 రద్దు వల్లే కశ్మీర్లో భారీ పోలింగ్‌

Published Sat, Oct 26 2019 4:20 AM

Support for removal of Article 370 behind huge voter turnout in J&K civic polls - Sakshi

న్యూఢిల్లీ: ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం వల్లనే జమ్మూకశ్మీర్లో గురువారం జరిగిన బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌(బీడీసీ) ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్‌ జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఆ ఎన్నికల్లో 98.3 శాతం పోలింగ్‌ నమోదైంది. ‘ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం తీసుకున్న భారత పార్లమెంటుకు కృతజ్ఞతలు. ఆ నిర్ణయానికి పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన ఎంపీలకు ధన్యవాదాలు. ఇక యువకులు, ఉత్సాహవంతులైన ప్రజా ప్రతినిధులు జమ్మూకశ్మీర్‌ రాత మారుస్తారు’ అని శుక్రవారం మోదీ ట్వీట్‌ చేశారు. ఎలాంటి హింసాత్మక, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈ ఎన్నికలు జరిగిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు.

‘జమ్మూ, కశ్మీర్, లేహ్, లదాఖ్‌ల్లో గురువారం బీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి హింస చోటు చేసుకోలేదు. 98% పైగా పోలింగ్‌ నమోదైంది. అక్కడి ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల ఉన్న విశ్వాసానికి ఇదే రుజువు’ అని మోదీ పేర్కొన్నారు. గత సంవత్సరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సర్పంచ్‌లు, వార్డ్‌ మెంబర్లే ఈ బీడీసీ ఎన్నికల్లో ఓటర్లు. ఆ ఎన్నికల్లో 22 మంది బీజేపీవారు సహా 27 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్, నేషనల్‌ కాన్ఫరెన్స్, పీపుల్స్‌ డెమొక్రాటిక్‌ పార్టీలు ఈ ఎన్నికలను బహిష్కరించాయి. ఆగస్ట్‌లో జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగ అధికరణ 370 ని రద్దు చేసిన విషయం తెలిసిందే. 

Advertisement
Advertisement