పవన్, రాధాకృష్ణ ఇద్దరూ చంద్రబాబు పాలేరులే! | Srikanth Reddy Fires on Pawan kalyan And Radha krishna | Sakshi
Sakshi News home page

పవన్, రాధాకృష్ణ ఇద్దరూ చంద్రబాబు పాలేరులే!

Dec 3 2019 7:55 AM | Updated on Dec 3 2019 7:55 AM

Srikanth Reddy Fires on Pawan kalyan And Radha krishna - Sakshi

శ్రీకాంత్‌రెడ్డికి శాలువాకప్పి అభినందిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

పీలేరు/రొంపిచెర్ల : రాష్ట్రంలో వేమూరి రాధాకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు పాలేరుల్లా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించా రు. శ్రీకాంత్‌రెడ్డి తిరుమల పాదయాత్ర సోమ వారం పీలేరుకు చేరుకుంది. స్థానిక శ్రీకృష్ణ దేవరాయ నూనెవిత్తుల కర్మాగారంలో ఆయన ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలు పండించుకుంటూ ఆనందంగా ఉన్నారన్నారు. గతంలో వైఎస్‌.రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలుచేశారని తెలిపారు. చంద్రబాబు వందల హామీలు ఇచ్చి ఒక్కటీ నెరవేర్చకపోయినా పవన్‌ కల్యాణ్‌ నోరెత్తకపోవడం ఆయన పాలేరుతనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆరు నెలల్లోనే సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తుండడంతో జీర్ణించుకోలేని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఆయన తొత్తులైన పవన్‌ కల్యాణ్, వేమూరి రాధాకృష్ణ ప్రభుత్వంపై బురద చల్లే పనిలో పడ్డారని ఆరోపించారు. నాయకుడంటే ప్రజల పక్షాన మాట్లాడాలని, పవన్, రాధాకృష్ణ ఇద్దరూ చంద్రబాబునాయుడుని కాపాడేందుకు కష్టపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్‌ ను ప్రజలు ఛీ కొట్టినా సిగ్గురాకపోవడం దురదృష్టకరమన్నారు. 

కులాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం
రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాధాకృష్ణకు చంద్రబాబు ఎంత దోచి పెట్టాడో ప్రజలందరికీ తెలుసన్నారు. ప్యాకేజీ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు మినహాయింపు లేదన్నారు. ఇప్పుడు దోచుకోడానికి అవకాశం లేకపోవడంతో బురదజల్లుతున్నారని తెలిపారు. టీటీడీని కూడా స్వార్థ రాజకీయాలకు వినియోగించుకోవడానికి ప్రయత్నించడం దారుణమన్నారు. రాయలసీమ ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి పట్టిన ఈ శనిత్రయాన్ని (చంద్రబాబు, పవన్, రాధాకృష్ణ)కి దేవుడే తగిన శాస్తి చేస్తాడని అన్నారు.

పాదయాత్రకు మంత్రి సంఘీభావం
పీలేరు : ప్రభుత్వ చీఫ్‌విప్‌ శ్రీకాంత్‌రెడ్డి చేపట్టిన తిరుమల పాదయాత్రకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావం తెలియజేశారు. సోమవారం ఆయన స్థానిక శ్రీకృష్ణదేవరాయ నూనెవిత్తుల కర్మాగారం వద్ద శ్రీకాంత్‌రెడ్డి, ఇతర నాయకులకు శాలువాలు కప్పి అభినందించారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు జగన్‌మోహన్‌రెడ్డి, వెంకట్రమణారెడ్డి, నాయకులు హరీష్‌ రెడ్డి, గజ్జల శీన్‌రెడ్డి, కడప గిరిధర్‌రెడ్డి, భానుప్రకాష్‌ రెడ్డి, కంభం సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement