‘రాహుల్‌ రామనామ జపమే మా విజయం’ | Smriti Irani Comments On Rahul Gandhi Over Narmada Aarti | Sakshi
Sakshi News home page

Oct 7 2018 8:43 AM | Updated on Mar 18 2019 9:02 PM

Smriti Irani Comments On Rahul Gandhi Over Narmada Aarti - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌ ఎన్నికల సందర్భంగా నర్మదా నదికి పూజలు చేసిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు చేశారు. ‘నర్మదా హరతి’సందర్భంగా రాహుల్‌ రామనామ జపం చేయడం బీజేపీ విజయంగా ఆమె అభివర్ణించారు. ఈ మధ్యకాలంలో రాహుల్‌ పలు దేవాలయాలు సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. అతివాద హిందువులతోనే ఘర్షణలు తలెత్తుతున్నాయని​ హిందుత్వంపై తరచూ విమర్శలు గుప్పిస్తున్న రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ పార్టీలు కోర్టుకు వెళ్లాలని అన్నారు. రాముడు లేడని అఫిడవిట్‌ దాఖలు చేయాలని స్మృతి ఎద్దేవా చేశారు.

హారతులు, రామనామ జపం చేస్తూనే మళ్లీ హిందూమతంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.  ఎన్నో ఏళ్లుగా గుర్తుకు రాని దేవాలయాలు, దైవ భక్తి ఎన్నికల వేళనే రాహుల్‌కి గుర్తుకు వచ్చాయని ఎద్దేవా చేశారు. ఓట్ల కోసమే రాహుల్‌ గుడిమెట్లు ఎక్కుతున్నారని స్మృతి చురకలంటించారు.

కాగా, ఇటీవల తన నియోజక వర్గం అమేథీని సందర్శించినప్పుడు కూడా రాహుల్‌ ఇటువంటి విమర్శలే ఎదుర్కొన్నారు. శివాలయంలో పూజలు చేసిన రాహుల్‌పై.. ‘ఫ్యాన్సీ డ్రెస్‌ కాంపీటీషన్‌లో పాల్గొన్న రాహుల్‌’ అంటూ బీజేపీ అధికార ప్రతినిధి సబిత్‌ పాత్ర వ్యాఖ్యానించారు. హిందూ టెర్రరిజం లష్కరే తొయిబా కంటే ప్రమాదకరమైనదని అసంబద్ధ వ్యాఖ్యలు చేసే రాహుల్‌ గాంధీ దేవాలయాలకు వెళ్లడమెందుకని ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement
Advertisement