పీవీకి భారతరత్న ఇవ్వాలి
ప్రధాని మోదీకి జానారెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించి సముచితంగా గౌరవించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధానికి లేఖ రాశా రు. 60 దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రధానిగా, ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఆయన దేశానికి విశిష్ట సేవలు అందించారని లేఖలో గుర్తు చేశారు. ప్రధానిగా పనిచేసిన సమయంలో దేశ జీడీపీని పరుగులు పెట్టించారని తెలిపారు. ఆయన సేవలకు గుర్తింపుగా భారతరత్న ఇవ్వడం సముచితంగా ఉంటుందన్నారు.
పౌర సేవల హక్కు చట్టంపై లేఖ..
పాలనలో పారదర్శకతకు రూపొందిస్తున్న పౌర సేవల హక్కు చట్టం రూపకల్పనలో ప్రజాప్రతినిధుల ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోవాలని జానారెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ఆయన సీఎంకు లేఖ రాశారు. చట్టం విషయంలో పూర్తి సహకారం అందిస్తామన్నారు. చట్టంపై లోక్సత్తా సమర్పించిన ముసాయిదాను లేఖతో పాటు కేసీఆర్కు పంపారు.