
మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠకు తెరపడలేదు.
ముంబై : మహారాష్ట్రలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న క్రమంలో శివసేన నేత సంజయ్ రౌత్ నేతృత్వంలో పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం గవర్నర్ భగత్ సింగ్ కొషియారితో సమావేశం కానుంది. గవర్నర్తో శివసేన నేతల భేటీని గవర్నర్ కార్యాలయం నిర్ధారించింది. కాగా, మహారాష్ట్ర గవర్నర్ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏకైక అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలని కోరతానని రౌత్ స్పష్టం చేశారు. అధికార పంపకంపై బీజేపీ-శివసేనల మధ్య సంవాదం కొనసాగుతుండటంతో ఇరు పార్టీలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాయి. చెరి రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలన్న శివసేన ప్రతిపాదనను బీజేపీ తోసిపుచ్చుతోంది. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన ముందుకు వస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఎన్సీపీ సంకేతాలు పంపడంతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారాయి. ఇక బీజేపీ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.