మంచి చేసినా తట్టుకోలేకపోతున్న బాబు | Sakshi
Sakshi News home page

మంచి చేసినా తట్టుకోలేకపోతున్న బాబు

Published Tue, Apr 7 2020 4:13 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌ సోకుతున్న ఈ విపత్కర సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తున్నా ప్రతిపక్ష నేత చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. వైద్యులు, పారిశుధ్య కార్మికులు, రెవెన్యూ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, వలంటీర్లు ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారని తెలిపారు. వారికి స్ఫూర్తిని ఇవ్వాల్సింది పోయి, జరుగుతున్న మంచిని చూడలేక, తట్టుకోలేక బాబు, ఆయన మనుషులు బురదజల్లుడు వ్యవహారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

అవినీతి, పక్షపాతం, వివక్ష లేకుండా రేషన్, పెన్షన్లు, పేద కుటుంబాలకు రూ.1000 ఆర్థిక సహాయం సీఎం వైఎస్‌ జగన్‌ అర్హులందరికీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఒక పథకాన్ని ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే, అది ప్రజలకు చేరడం గగనంగా ఉండేదన్నారు. సంక్షేమ ఫలాలు 100 మంది అర్హులు ఉంటే 10 మందికి కూడా అందేవికావన్నారు. నేడు ప్రజలకు ఏదైనా చేయాలని ప్రభుత్వం అనుకుంటే గంటల్లోనే డోర్‌ డెలివరీ జరుగుతోంది. ఇంత విపత్తు సమయంలో కూడా ఏప్రిల్‌ 1న 93 శాతం పెన్షన్లు పంపిణీ చేశారన్నారు. ఏప్రిల్‌ 4న కోటి కుటుంబాలకు రూ.1,000ల చొప్పున ఆర్థిక సహాయం చేశామన్నారు. 

పేదలకు సాయం మీకు ఇష్టం లేదా?
లాక్‌డౌన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన పేదలకు రాష్ట్రప్రభుత్వం ఎంతో బాధ్యతగా అందిస్తున్న సహాయంపైనా రాజకీయం చేయాలనుకోవడం దిగజారుడుతనం తప్ప మరొకటి కాదు. దీనిపై చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. ఆయన వెంట నడిచే బీజేపీ కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ రామకృష్ణ వంటివారు ఈసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. అసలు ఇపుడు కోడ్‌ అమల్లో లేదు. ఎన్నికలకు దీనికి సంబంధమే లేదు. అయినా ఈసీకి కంప్లయింట్‌ చేయడం చూస్తే పేదలకు సహాయం అందడం వారినెంతగా బాధపెడుతున్నదో అర్ధమౌతున్నది. కోడ్‌కు, దీనికి సంబంధం లేదని ఈసీ స్పష్టం చేయడం వీరికి చెంపపెట్టు లాంటిది . 

Advertisement

తప్పక చదవండి

Advertisement