కమిటీల నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి: సజ్జల | Sajjala Ramakrishna Reddy Review On Ysrcp Organizational Structure | Sakshi
Sakshi News home page

కమిటీల నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి: సజ్జల

Dec 28 2025 5:34 PM | Updated on Dec 28 2025 5:48 PM

Sajjala Ramakrishna Reddy Review On Ysrcp Organizational Structure

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కమిటీల నిర్మాణంపై నాయకులంతా సీరియస్‌గా దృష్టి పెట్టాలని.. ఇది ఒక స్పెషల్ డ్రైవ్‌లా ముందుకు తీసుకెళ్లాలని పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు.  ఆదివారం(డిసెంబర్‌ 28) ఆయన వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో జూమ్‌ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సమీక్ష జరిపారు.

ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ‘‘అందరూ ఫోకస్‌తో పనిచేయాలి. పార్టీ కార్యక్రమాలతో పాటు కమిటీల నిర్మాణం అనేది కూడా అత్యంత ప్రాధాన్యమైనదని వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా చెప్పారు. కమిటీలలో నియామకాలు నిర్మాణాత్మకంగా జరగాలి, మొక్కుబడిగా ఉండకూడదని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఫిబ్రవరి మొదటి వారంకల్లా కమిటీలన్నీ నియామకాలు పూర్తి అవ్వాలి. విలేజ్‌, వార్డు కమిటీలు త్వరగా పూర్తిచేయాలి, డేటా అంతా ఎలాంటి తప్పులు లేకుండా సరిగా ఉండాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘డేటా ప్రొఫైలింగ్‌ సరిగా ఉంటే మనకు భవిష్యత్‌లో అనేక ఉపయోగాలు ఉంటాయి. పార్టీ కేంద్ర కార్యాలయంతో అనుసంధానం జరుగుతుంది. దాదాపు 15 లక్షల మంది వైఎస్సార్సీపీ సైన్యానికి కేంద్ర కార్యాలయం నుంచి సమాచారం నేరుగా అందేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇదంతా కూడా ఆర్గనైజ్డ్‌ సోల్జర్స్‌ను రెడీ చేసే కార్యక్రమంలో భాగమే. ఇప్పటికే ప్రతి నియోజకవర్గం నుంచి డిజిటల్ మేనేజర్లు కూడా అందుబాటులో ఉన్నారు. కమిటీల నియామకంపై నాయకులకు అవసరమైన ఓరియెంటేషన్‌ కూడా ఇప్పటికే ఇస్తున్నాం.

..ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సైంటిఫిక్‌గా కమిటీల నియామకాలు పూర్తి అయ్యాయి. కడప పార్లమెంట్‌, వేమూరు, పుంగనూరు, మడకశిర ఇలా కొన్ని నియోజకవర్గాల్లో  పైలెట్‌ ప్రాజెక్ట్ గా మైక్రో లెవల్ లో కూడా అన్ని కమిటీలు పూర్తయ్యాయి. కమిటీల నియామకంపై పార్టీ సీనియర్‌ నాయకులు కొందరితో టాస్క్‌ ఫోర్స్‌ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశాం, వారంతా కూడా అవసరమైన సమావేశాలు నిర్వహించుకుని ఇది ఒక డ్రైవ్‌ లాగా చేయాలని నిర్ధేశించాం. కమిటీల నియామకాలు అన్నీ పక్కాగా జరిగితే ఏ ఎన్నికలు జరిగినా గెలుపు సులభతరమవుతుంది. పార్టీ అనుబంధ విభాగాల కమిటీలు పక్కగా ఉంటే పార్టీ ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా విజయవంతం చేయవచ్చు’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement