కుటుంబ సమేతంగా సోనియాను కలిసిన రేవంత్‌

Revanth Reddy Family Meets Sonia Gandhi - Sakshi

న్యూఢిల్లీ : టీపీసీసీ ముఖ్య నాయకుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంగళవారం సమావేశమయ్యారు. కుటుంబ సమేతంగా రేవంత్‌ సోనియాను కలవడం చర్చనీయాంశంగా మారింది. అయితే రేవంత్‌రెడ్డి సోనియాను మర్యాద పూర్వకంగానే కలిసినట్టు ఆయన అనుచరులు చెప్తున్నారు. సోనియాను కలిసిన వారిలో రేవంత్‌ భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. వీరు సోనియా గాంధీతో కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొంతకాలంగా రేవంత్‌ కాంగ్రెస్‌ను వీడతారని ప్రచారం జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే రేవంత్‌ ఆ వార్తలను ఎప్పటికప్పుడూ ఖండిస్తూ వస్తున్నారు.

అంతకుముందు ఢిల్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆయన తనయుడు కేటీఆర్‌లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పాలనలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. వివిధ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ఇచ్చిన ర్యాంకులే దీనికి నిదర్శనమని అన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top