
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యం తగ్గింది. 2014 ఎన్నికల్లో మొత్తం తొమ్మిది మంది విజయం సాధించగా ఈసారి ఆ సంఖ్య ఐదుకి పడిపోయింది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్లో ఆరుగురు, కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు మహిళలు ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. ఈసారి టీఆర్ఎస్ పార్టీ కొండా సురేఖ, బొడిగె శోభలకు టికెట్ నిరాకరించింది. దీంతో కోవా లక్ష్మి (ఆసిఫాబాద్), పద్మా దేవేందర్రెడ్డి (మెదక్), రేఖానాయక్ (ఖానాపూర్), గొంగిడి సునీత (ఆలేరు) ఎన్నికల్లో పోటీ చేశారు.
వీరిలో కోవా లక్ష్మి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. మరోవైపు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), హరిప్రియా నాయక్ (ఇల్లందు) గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థులు డీకే అరుణ (గద్వాల), గీతారెడ్డి (జహీరాబాద్), పద్మావతిరెడ్డి (కోదాడ), కొండా సురేఖ (పరకాల) కూడా పరాజయం పాలయ్యారు. ఇక బీజేపీ నుంచి పోటీ చేసిన బొడిగె శోభ (చొప్పదండి)కు కూడా ఓటమి తప్పలేదు.