ఎర్రకోటలో రాహుల్ జాతీయ జెండావిష్కరణ!
2019లో అందుకు సిద్ధం కావాలి
కాంగ్రెస్ నేత సిద్ధూ సూచన
న్యూఢిల్లీ : 2019 సంవత్సరంలో ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు రాహుల్గాంధీ సిద్ధం కావాలని, ఆయనను కార్యకర్తలు ప్రధానమంత్రిని చేయబోతున్నారని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అన్నారు. ఢిల్లీలో జరగుతున్న కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీలో సిద్దూ మాట్లాడారు. ప్రధానిగా ఎర్రకోట నుంచి జాతీయ జెండాను ఎగురవేసేందుకు రాహుల్ సిద్ధం కావాలని ఆయన సూచించారు.
‘ ప్రధానమంత్రి మాజీ కాగలడు. ఎంపీ మాజీ కాగలడు. ఎమ్మెల్యే మాజీ కాగలడు. కానీ ఒక కార్యకర్త ఎప్పుడూ మాజీ కాబోడు. కార్యకర్తలను రాహుల్ అక్కున చేర్చుకోవాలి. వారే ఎర్రకోటపై రాహుల్ జెండా ఎగురవేసేలా చేస్తారు’ అని అన్నారు. బీజేపీ ఎంత రచ్చ చేస్తున్నా.. కనీసం మన్మోహన్ సింగ్ మౌనంగా ఉండి చేసినంత అభివృద్ధి కూడా చేయలేకపోతోందని చమత్కరించారు. దీంతో సోనియాగాంధీ, అశోక్ గెహ్లాట్ నవ్వుల్లో మునిగిపోయారు.