కొలువుదీరిన కొత్త సీడబ్ల్యూసీ

Rahul Gandhi Rejigs Congress Party Panel - Sakshi

23 మంది సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులకు చోటు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో నిర్ణయాలు తీసుకునే అత్యున్నత విభాగం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) మంగళవారం ఏర్పాటైంది. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ పగ్గాలు చేపట్టాక ఏర్పడిన తొలి సీడబ్ల్యూసీ ఇదే కావడం గమనార్హం. ఈసారి యువత, సీనియర్లకు సమాన ప్రాధాన్యమిస్తూ రాహుల్‌ జాబితా రూపొందించారు. ఇందులో 23 మంది సభ్యులు, 18 మంది శాశ్వత ఆహ్వానితులు, 9 మంది ప్రత్యేక ఆహ్వానితులకు చోటు కల్పించారు.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికీ స్థానం దక్కలేదు. రాష్ట్రాలకు పార్టీ ఇండిపెండెంట్‌ ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న నాయకులు తమ పదవీరీత్యా శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. పార్టీ అనుబంధ సంస్థలైన ఐఎన్‌టీయూసీ, సేవా దళ్, యూత్‌ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ చీఫ్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా వ్యవహరిస్తారు. కొత్త సీడబ్ల్యూసీ తొలి సమావేశాన్ని జూలై 22న నిర్వహించాలని రాహుల్‌ నిర్ణయించారు.

ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, శాసనసభాపక్ష నేతలను కూడా ఆహ్వానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌  నుంచి సీడబ్ల్యూసీ సభ్యుల్లో ఎవరికీ చోటు దక్కకపోవడం ఊహించని పరిణామం. ఏపీలో కాంగ్రెస్‌ చాలా బలహీనపడినా, తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం. సీడబ్ల్యూసీలో తెలంగాణ, ఏపీల ను విస్మరించే పరిస్థితే రాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. పొరపాటు వల్ల అలా జరిగి ఉండొచ్చని, త్వరలోనే సరిచేస్తామని చెప్పాయి. అయితే, తెలంగాణ నుంచి ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడి హోదాలో సంజీవరెడ్డికి ప్రత్యేక ఆహ్వానితుడిగా స్థానం దక్కింది.

సీడబ్ల్యూసీ సభ్యులు..
1.రాహుల్‌ గాంధీ 2. సోనియా గాంధీ 3. మన్మోహన్‌ సింగ్‌ 4.మోతీలాల్‌ వోరా 5.గులాం నబీ ఆజాద్‌ 6.మల్లికార్జున్‌ ఖర్గే 7.ఏకే ఆంటోనీ 8.అహ్మద్‌ పటేల్‌ 9.అంబికా సోని 10.ఊమెన్‌ చాందీ 11.తరుణ్‌ గొగోయ్‌ 12.సిద్దరామయ్య 13.ఆనంద్‌ శర్మ 14.హరీశ్‌ రావత్‌ 15.కుమారి సెల్జా 16.ముకుల్‌ వాస్నిక్‌ 17.అవినాశ్‌ పాండే 18.కేసీ వేణుగోపాల్‌ 19.దీపక్‌ బాబారియా 20.తామ్రద్వాజ్‌ సాహు 21. రఘువీర్‌ మీనా 22.గైకాంగమ్‌ గాంగ్మె 23.అశోక్‌ గెహ్లాట్‌

శాశ్వత ఆహ్వానితులు..
1.షీలా దీక్షిత్‌ 2.పి.చిదంబరం 3.జ్యోతిరాదిత్య సింధియా 4. బాలసాహెబ్‌ థోరాట్‌ 5.తారిక్‌ హమీద్‌ కర్రా 6.పీసీ చాకో 7.జితేంద్రసింగ్‌  8.ఆర్‌పీఎన్‌ సింగ్‌ 9.పీఎల్‌ పూనియా 10.రణదీప్‌ సుర్జేవాలా 11.ఆశాకుమారి 12.రజనీ పాటిల్‌ 13.ఆర్‌సీ కుంతియా 14.అనుగ్రహ నారాయణ్‌ సింగ్‌ 15.రాజీవ్‌ ఎస్‌ సాతవ్‌ 16.శక్తిసిన్హా గోహిల్‌ 17.గౌరవ్‌ గొగోయ్‌ 18.ఎ.చెల్లాకుమార్‌

ప్రత్యేక ఆహ్వానితులు..
1.కేహెచ్‌ మునియప్ప 2.అరుణ్‌ యాదవ్‌ 3.దీపేందర్‌ హుడా 4.జితిన్‌ ప్రసాద్‌ 5.కుల్దీప్‌ బిష్ణోయ్‌ 6. ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు 7.ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు 8. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు 9. సేవాదళ్‌ ప్రధాన నిర్వాహకుడు.

చోటు కోల్పోయిన ప్రముఖులు..
దిగ్విజయ్‌ సింగ్, జనార్దన్‌ ద్వివేది, కమల్‌నాథ్, సుశీల్‌కుమార్‌ షిండే, కరణ్‌సింగ్, పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్, హరియాణా మాజీ సీఎం భూపిందర్‌ హుడా, హిమాచల్‌ మాజీ సీఎం వీరభద్రసింగ్, సీనియర్‌ నాయకులు మోహన్‌ ప్రకాశ్, ఆస్కార్‌ ఫెర్నాండెజ్, సీపీ జోషి, మొహసినా కిద్వాయ్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top