
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్న బీజేపీ, టీడీపీలకు కాలం మూడిందని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. హోదా కోసం ‘ఛలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చిన ఉద్యమకారులపై ఏపీ ప్రభుత్వం అమానుష నిర్బంధ చర్యలకు పాల్పడటాన్ని ఆయన ఖండించారు. సోమవారం హైదరాబాద్లోని ఇందిరాభవన్లో పీసీసీ ఉపాధ్యక్షులు ఎన్.తులసిరెడ్డి, సూర్యానాయక్, ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతంలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
టీడీపీ ప్రభుత్వం అసెంబ్లీలో రెండు దఫాలు ప్రత్యేక హోదాపై తీర్మానాలు చేసిందని, దానిని గుర్తు చేసేందుకు వెళ్తున్న వారిని అరెస్టు చేయడం దారుణం అన్నారు. హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ద్రోహం చేశాయన్నారు. ఇదిలా ఉండగా దేశంలోని పీసీసీ సభ్యులందరూ రాహుల్ గాంధీని ఏఐసీసీ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబోతున్నారని, ఆయన నాయకత్వంలోని దేశం, ప్రజలు, యువత ముందుకెళ్తుందని ఆయన పేర్కొన్నారు.