సిట్ అంటే సిట్...స్టాండ్ అంటే స్టాండ్..
సాక్షి, ఆచంట: వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును రాష్ట్ర ప్రభుత్వం మసిపూసి మారేడుకాయలా చేస్తోందని వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంట్ నేత రఘురామ కృష్ణంరాజు అన్నారు. శనివారం ఆయన ఆచంటలో మాట్లాడుతూ.....’వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే చంద్రబాబు సిట్ అంటే సిట్...స్టాండ్ అంటే స్టాండ్. సీబీఐ విచారణ నిష్పక్షపాతంగా ఉంటుంది. సిట్కు సీబీఐకి ఉన్న తేడా అది. సిట్ కాకుండా సీబీఐ విచారణతోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
ఈ హత్యకేసులో టీడీపీ వాళ్లు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే తాము కాదంటే కాదని భుజాలు తడుముకుంటున్నారు. విచారణ జరిగితేనే అసలు విషయాలు బయటకు వస్తాయి. అందుకే సీబీఐ విచారణకు చంద్రబాబు వెనుకంజ వేస్తున్నారు. బీసీల కోసం ఎన్టీఆర్ స్థాపించిన నాటి తెలుగుదేశం ఇది కాదని ప్రజలకు, అభిమానులకు అర్థం అయింది. ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న తెలుగుదేశం పార్టీని కనిపించకుండా చేయాలి.’ అని పిలుపునిచ్చారు.