నితీశ్‌ కేబినెట్‌లోకి కొత్త మంత్రులు!

Nitish makes eight JDU members Bihar ministers - Sakshi

సాక్షి, పట్నా : బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా మరో 8మందికి తన కేబినెట్‌లో చోటు కల్పించారు. జేడీయూ నేతలు అశోక్ చౌదరి, శ్యాం రజాక్‌, ఎల్ ప్రసాద్‌, భీమా భారతి, రామ్‌సేవక్ సింగ్‌, సంజయ్‌ ఝా, నీరజ్‌ కుమార్‌, నరేంద్రనారాయణ్‌ యాదవ్‌ మంత్రులుగా ప్రమాణం స్వీకరించారు. బిహార్‌లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ.. ఈసారి విస్తరణలో బీజేపీ నుంచి ఎవరినీ కేబినెట్‌లోకి తీసుకోకపోవడం గమనార్హం. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ జేడీయూ కేంద్ర కేబినెట్‌లో చేరడానికి నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేవలం జేడీయూ నేతలతో నితీశ్‌ తన మంత్రివర్గాన్ని విస్తరించి.. బీజేపీకి దీటైన బదులు ఇచ్చినట్టు భావిస్తున్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నప్పటికీ బీజేపీ-జేడీయూ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్టు తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. 

రాజ్‌భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బిహార్ గవర్నర్‌ లాల్జీ టాండన్‌ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. తాజా విస్తరణలో బిహార్‌ కేబినెట్‌ మంత్రుల సంఖ్య 33కు చేరింది. మరో ముగ్గురుకి చోటుంది. కాగా వచ్చే ఏడాది బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి ఇదే చివరి మంత్రివర్గ విస్తరణగా భావించొచ్చు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top