ఆడా ఉంటా.. ఈడా ఉంటా | Nation Is Waiting For A Leader With Vision Says Kcr | Sakshi
Sakshi News home page

ఆడా ఉంటా.. ఈడా ఉంటా

Mar 12 2018 2:32 AM | Updated on Aug 15 2018 9:04 PM

Nation Is Waiting For A Leader With Vision Says Kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జాతీయ రాజకీయాల్లోకి వెళ్లినంత మాత్రాన తాను తెలంగాణను విడిచిపెట్టేది లేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టంచేశారు. ఇక్కడ ఉండే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశమంతా విజన్‌ ఉన్న పార్టీలు, నేతల కోసం ఎదురుచూస్తోందని వ్యాఖ్యానించారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలనుద్దేశించి కేసీఆర్‌ మాట్లాడారు.

‘‘1976లో మావో చనిపోయే నాటికి చైనా ఆకలిచావులతో అల్లాడుతోంది. అయినా అక్కడి నాయకత్వం అకుంఠిత దీక్ష, ప్రజల కఠోర శ్రమతో ప్రపంచంలోనే ఎన్నో అద్భుతాలను సృష్టించింది. 25 ఏళ్లలోనే అనూహ్య ఆర్థిక ప్రగతి సాధించింది. మన దగ్గర చైనా కన్నా ఎక్కువ వనరులున్నాయి. కానీ విజన్‌ ఉన్న నేతలు, పార్టీలు లేవు. కాంగ్రెస్‌ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్‌ వస్తుంది. అవే విధానాలు.

పథకాల పేర్లు మారతాయి తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు. దేశంలో 75 వేల టీఎంసీల నీళ్లు లభ్యమవుతుంటే 40–45 వేల టీఎంసీలు సముద్రంలోనే కలుస్తున్నాయి. ఆ నీళ్లను పట్టించుకునే వారే లేరు. వినియోగించుకోవాలని ఆలోచించే వారే లేరు. దేశంలో ఫెడరల్‌ స్ఫూర్తిని నిలబెట్టాల్సిన బాధ్యత రాజకీయ పార్టీగా మనపై ఉంది. అందుకే రాజకీయాల్లో మార్పు, ప్రగతి కోసమే దేశ రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నా. మీరెవరూ ఆందోళన చెందవద్దు. నేను ఇక్కడే ఉంటా. ఇక్కడ ఉండే దేశ రాజకీయాలను నడిపిస్తా’’అని వివరించారు.

దగ్గరుండి గెలిపించుకుంటా
రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్‌లందరికీ మళ్లీ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని కేసీఆర్‌ చెప్పారు. ఈసారి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 106–107 స్థానాలు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయని ఎమ్మెల్యేలకు వివరించారు. అక్కడక్కడా ఇబ్బంది ఉన్నా ఆందోళన చెందాల్సిన పనిలేదని, తాను దగ్గరుండి ఆ అభ్యర్థులను గెలిపించుకుని వస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డిలను సీఎం ప్రత్యేకంగా ప్రస్తవించారు.

వారిరువురి పనితీరుపట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరికీ సర్వేలో మంచి మార్కులు వచ్చినట్టు చెప్పారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ సమావేశానికి గైర్హాజరు కావడంతో ఎందుకు రాలేదంటూ ఆరా తీశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఎమ్మెల్యేలంతా కీలకంగా వ్యవహరించాలని, ప్రజల్లోకి ఎంత వెళ్తే అంత మంచి జరుగుతుందని చెప్పారు. ముఖ్యంగా పెట్టుబడి సాయం పథకం కింద చెక్కులు అందజేసే కార్యక్రమాల్లో పాల్గొనాలని, అవసరమనుకున్న చోట పార్టీ ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.

అందరూ అసెంబ్లీకి టైంకి రావాలని, చర్చల్లో పాల్గొనాలని సూచించారు. ప్రతిపక్షాల విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని, కాంగ్రెసోళ్ల దగ్గర సమాధానం లేదు.. సబ్జెక్టు అంతకంటే లేదని అన్నారు. ఏదో విధంగా గవర్నర్‌ ప్రసంగాన్ని బహిష్కరించి వెళ్లిపోయే ఆలోచనలో కాంగ్రెస్‌ ఉంటుందని, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సహనంతో వ్యవహరించాలని సూచించారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్‌ అలీ, కడియం శ్రీహరి, పార్లమెంటులో పార్టీ నేతలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిలతోపాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement