ప్రచారంలో నేరస్తులు

Murder Case Convicted Person IN TDP MLA Candidate Paritala Sriram Election Campaign - Sakshi

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: జిల్లాలో టీడీపీ అభ్యర్థులు బరి తెగిస్తున్నారు. ముఖ్యంగా నేరస్తులను చేరదీసి ప్రజలను భయాందోళనకు గురి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అందులో భాగంగా ప్రచార కార్యక్రమాలకు రౌడీషీటర్లు, నేర చరిత్ర ఉన్న వ్యక్తులను వెంట తీసుకెళ్తున్నారు. దీని వలన ఆయా గ్రామాల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకుల్లో ఓ రకమైన భయాందోళన కలిగించడమే లక్ష్యంగా పెటుŠుట్కన్నట్లు అర్థమవుతోంది. ముఖ్యంగా ఈ తరహా వ్యవహారాలు అనంతపురం అర్బన్, రాప్తాడు నియోజకవర్గాల నుంచి ఎక్కువశాతం కనిపిస్తున్నాయి. 

గతంలోనే వ్యూహరచన  
తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ తరహా కుట్రపూరిత రాజకీయాలు ప్రారంభించారు. టార్గెట్‌ 2019గా పెట్టుకొని ప్రత్యర్థి పార్టీలలో చురుగ్గా పాల్గొంటున్న వ్యక్తులను హతమార్చారు. అం దులో భాగంగా వైఎస్సార్‌సీపీ రాప్తాడు మండల మాజీ కన్వీనర్‌ ప్రసాద్‌రెడ్డిని దారుణంగా హత్య చేశారు. ఈయన బతికుంటే వచ్చే ఎన్నికలకు ఇబ్బందనే కారణంతో ప్రత్యర్థులను చేరదీసి హత్యకు ఉసిగొల్పారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇందుకు బలం చేకూర్చే విధంగా హత్య కేసులో నిందితులు ఎప్పుడూ పరిటాల శ్రీరామ్‌ చుట్టూనే ఉంటున్నారు. అనంతపురం నగరంలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. రౌడీషీటర్ల ఆధిపత్య పోరులో భాగంగా గతేడాది రుద్రంపేటలో జంటహత్యలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో హత్యలో పాల్గొన్న నిందితులను ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి చేరదీస్తున్నాడనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎన్నికల సమయంలో వీరి సేవలను వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. 

పోలీసు నిఘా వ్యవస్థ చర్యలు శూన్యం 
పోలీసుశాఖలో నిఘా వ్యవస్థ నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రౌడీషీటర్లు, హత్యకేసు నిందితులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. ఎన్నికల సమయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి. అయితే జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థ పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ అనుయాయులుగా చెలమాణి అవుతున్న రౌడీషీటర్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ సీఐ నేరస్తులకు రాచమర్యాదలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో చాలావరకు వారిని బైండోవర్లు కూడా చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజలను భయాబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు.   

  • రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుడు, మండల మాజీ కన్వీనర్‌ ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో ఉన్న ప్రధాన నిందితుడు పంచగల శ్రీనివాసులు అలియాస్‌ ఉప్పర శ్రీనివాసులు ఇటీవల టీడీపీ తరఫున జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నాడు. ఈయనకు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌ మద్దతు కూడా ఉండడంతో గ్రామాల్లో తిరుగుతున్నాడు. 
  • నగరంలో ఓ రౌడీషీటర్‌ను ఇటీవల నాల్గవ పట్టణ పోలీసులు స్టేషన్‌కు రావాలని ఆదేశించారు. ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా బైండోవర్‌ చేయాలని నిర్ణయించారు. అయితే సదరు రౌడీషీటర్‌ స్టేషన్‌కు రాకుండా నేరుగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రభాకర్‌చౌదరి వద్దకు వెళ్లాడు. ఆయన చేత స్టేషన్‌ ఉన్నతాధికారికి ఫోన్‌ చేయించడంతో అతడి బైండోవర్‌ ఆగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం.   
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top