మరోసారి అక్కడి నుంచే మోదీ పోటీ..! | Modi May Again Contest From Varanasi In Next Elections | Sakshi
Sakshi News home page

మరోసారి అక్కడి నుంచే మోదీ పోటీ..!

Mar 9 2019 6:40 PM | Updated on Mar 9 2019 7:08 PM

Modi May Again Contest From Varanasi In Next Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోకసభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏ స్థానం నుంచి పోటీచేస్తారన్న ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో​ అత్యధిక మెజార్టీతో గెలిచిన వారణాసి నుంచే మరోసారి పోటీచేస్తారని బీజేపీ వర్గాల సమాచారం. ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు శనివారం ఆపార్టీ పార్లమెంటరీ కమిటీ ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యింది. దీనిలో ప్రధానంగా మోదీ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న అంశంపై చర్చజరిగినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో మోదీతో సహా, అరుణ్‌ జైట్లీ, సుష్మా స్వరాజ్‌, రాజ్‌నాథ్‌ సింగ్‌, అమిత్‌ షా తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కీలకంగా భావించే యూపీ నుంచి మోదీ పోటీ చేస్తే కార్యకర్తల్లో మరింత ఉత్సహాన్ని నింపొంచ్చని, గత ఫలితాలను తిరిగి పునరావృత్తం చేయవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో మోదీ మరోసారి వారణాసి నుంచి బరిలో నిలువనున్నారు. గత ఎన్నికల్లో వడోదర, వారణాసి రెండు స్థానాల్లో పోటీచేసిన ప్రధాని రెండింటిలో గెలిచిన విషయం తెలిసిందే. వారాణాసిలో అత్యధికంగా 5,81,022 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మరోవైపు మోదీ  ఒడిశాలోని పూరీ లోక్‌సభ స్థానంనుంచి పోటీచేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై ఇప్పటివరకు బీజేపీ, గానీ మోదీ నుంచిగానీ ఎలాంటి స్పందనరాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement