‘సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ హామీ ఊసే ఎత్తడం లేదు’
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల పక్షాణ నిలబడలేని మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ఎందుకూ ఆ మంత్రి పదవి అంటూ ఎమ్మోల్సీ జీవన్రెడ్డి మండిపడ్డారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సంఘం నాయకుడి పేరు మీద మంత్రి పదవి పొందిన శశ్రీనివాస్ గౌడ్ ఇప్పుడు వారి సమస్యలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగులంతా.. రాష్ట్రం ఎర్పడిన తర్వాత వివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. హుజుర్నగర్ ఉప ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను పిలిపించి పీఆర్సీ త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు పీఆర్సీ ఊసే ఎత్తడం లేదని ధ్వజమేత్తారు. వేతన సవరణ ఉద్యోగుల హక్కు అన్నారు. గతంలో 10 జిల్లాలో పని చేసిన ఉద్యోగులను ఇప్పుడు 33 జిల్లాలో పని చేపిస్తున్నారన్నారు. 20 నెలలు గడుస్తున్న మధ్యంతర భృతి లేదని, ఉద్యోగులల్లో ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు.
కాగా.. ఉమ్మడి రాష్ట్రంలో పొందిన సౌకర్యాలను తెలంగాణ రాష్ట్రంలో పొందలేక పోతున్నారని జీవన్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. ఇక నిరుద్యోగ భృతి అయితే ఇంత వరకూ అమలుకే నోచుకోలేదని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అక్కడ నిరుద్యోగులకు మధ్యంతర భృతి ఇచ్చి ఉద్యోగులకు ఫ్రెండ్లి ప్రభుత్వంగా ఉంటున్నారన్నారు. వయసులో చిన్నవాడు అయినా ఆయనను చూసి సీఎం కేసీఆర్ నేర్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఇక ఉద్యోగుల పక్కన నిలబడని మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అంతేగాక సీఎం కేసీఆర్ ఇప్పటికైనా పీఆర్సీని వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.