సీపీఐలో నాయకత్వ మార్పు! | Leadership changes in CPI | Sakshi
Sakshi News home page

సీపీఐలో నాయకత్వ మార్పు!

Jun 6 2019 2:21 AM | Updated on Jun 6 2019 2:21 AM

Leadership changes in CPI - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీపీఐ నాయకత్వ మార్పుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాన కార్య దర్శి బాధ్యతలను మరొకరికి అప్పగించాలని సురవరం సుధాకరరెడ్డి చేసిన విజ్ఞప్తిని పార్టీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆరోగ్య కారణాలరీత్యా పార్టీ అత్యున్నత బాధ్యతల నుంచి తప్పించాలని జాతీయ కార్యవర్గ సమావేశంలో సురవరం కోరినట్టు సమాచారం. దీంతో నాయకత్వ బాధ్యతలను మార్చడానికి పార్టీ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. వచ్చే నెల 19, 20, 21 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో దీనిపై చర్చించనున్నారు.

ఇందుకు జాతీయ కౌన్సిల్‌ ఆమోదం తెలిపితే నాయకత్వ మార్పునకు అవకాశముంటుందని పార్టీ వర్గాల సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవికి అతుల్‌కుమార్‌ అంజన్, అమర్‌జిత్‌కౌర్, డి.రాజా, కె.నారాయణ, కనమ్‌ రాజేంద్రన్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. 2012లో పార్టీ పగ్గాలు చేపట్టిన సురవరం.. వరుసగా 3 సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన పదవీకాలం 2021 వరకు ఉంది. అయితే 77 ఏళ్ల వయసుతోపాటు అలర్జీ, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా ఆ పదవిలో కొనసాగడానికి విముఖత వ్యక్తంచేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement