వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ను గుర్తు చేసుకున్న కోమటిరెడ్డి

Published Sat, Apr 27 2019 4:44 PM

Komatireddy Venkat Reddy Memorise YS Rajasekhara Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డిని గుర్తు చేసుకున్నారు. ‘నాయకుడంటే పార్టీలు మారడం కాదు.. చనిపోయినా ప్రజల్లో బతికి ఉండాలి. వైఎస్సార్‌ చనిపోయి తొమ్మిదేళ్లయినా ఇంకా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు. కానీ, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయి. పాలన గాలికొదిలేసి ఎంతసేపు టికెట్లు అమ్ముకోవడం... ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేయడమే పనిగా పెట్టుకున్నారు’ అని చురకలంటించారు. 

‘16 సీట్లు గెలిపిస్తే భారతదేశాన్ని ఏలుతానన్న కేసీఆర్‌ ఇంటర్మీడియట్‌ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేని అసమర్థుడని తేలిపోయింది. 20 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆర్‌ కారకుడయ్యారు. జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలి. రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే పేదలకు 6వేల పెన్షన్‌, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, గృహ నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తాం’అని వెంకటరెడ్డి హామినిచ్చారు.

Advertisement
Advertisement