టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే
సాక్షి, హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థులను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటించారు. వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నాయకుడు పోచంపల్లి శ్రీసివాస రెడ్డి, రంగారెడ్డి అభ్యర్థిగా మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, నల్గొండ అభ్యర్థిగా పార్టీ సీనియర్ నేత తేరా చిన్నపరెడ్డిని బరిలోకి దింపాలని కేసీఆర్ నిర్ణయించారు. నల్గొండ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్రెడ్డి పేరు పరిశీలించినా ఆయన శాసనసభ్యుల కోటా స్థానం కావాలని కోరుతున్నందున ప్రత్యామ్నాయంగా తేరా చిన్నపరెడ్డి వైపు కేసీఆర్ మొగ్గు చూపారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన పట్నం నరేందర్రెడ్డి, మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డితో పాటు తెరాస నుంచి బయటకు వచ్చిన కొండా మురళీ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయడంతో ఈ మూడు స్థానాలు ఖాళీ అయ్యాయి. దాంతో ఆ స్థానాలకు ఉప ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.