అమ్మో.. శంకరా!

Karnataka People Case Filed Against Thamballapalle MLA Shankar - Sakshi

తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిపై బెంగళూరులో చీటింగ్‌ కేసులు

ఎన్నికల అఫిడవిట్‌లో ఒక్క కేసునూ పేర్కొనని వైనం

నా పరిధిలోకి రాదంటున్న రిటర్నింగ్‌ ఆఫీసర్‌

ఎస్సీ, ఎస్టీల స్థలాలు ప్లాట్లు వేసి విక్రయం

శంకర్‌ యాదవ్‌ ఘరానా దొంగ బెంగళూరు బాధితులు

ఈయన పేరు శంకర్‌. చేసేవన్నీ వంకర పనులే. ఈయన వృత్తి వ్యాపారం. ప్రవృత్తి మోసాలు చేయ డం. భూ కబ్జాలు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అప్పులు చేయడం.. ఆ తరువాత ఎగ్గొట్టడం శంకర్‌కు నిత్యకృత్యం. బెంగళూరులో ఏకంగా కర్ణాటక ప్రభుత్వ భూములనే కబ్జా చేశారు. ఎస్సీ ఎస్టీ భూములను ఆధీనంలోకి తీసుకుని అమ్మేశారు. లేని భూమిని అమ్మేసి.. పక్క రాష్ట్రంలో రికార్డు సృష్టించా రు మాయదారి టీడీపీ ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌.

సాక్షి, చిత్తూరు: తంబళ్లపల్లి ఎమ్మెల్యే శంకర్‌ యాదవ్‌ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరులో క్రిమినల్, చీటింగ్‌ కేసులు నమోదైనా వాటిని అఫిడవిట్‌లో ప్రస్తావించలేదు. మదనపల్లె 1టౌన్‌ పరిధిలో కూడా కేసు ఉన్నా దాని ఊసే లేదు. కనీసం ఒక్క కేసు ప్రస్తావన లేకుండా అఫిడవిట్‌ ఎన్నికల సంఘానికి ఇచ్చారు. దీంతో ప్రతిపక్షాలు శంకర్‌పై న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయి. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టిం చిన శంకర్‌ యాదవ్‌పై వేటు వేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. బెంగళూరులో వేలాది మందిని మోసం చేసిన మోసగాడని, అలాంటి వారికి ఎన్నికల్లో పోటీచేసే అర్హత లేదని నినదిస్తున్నాయి.

రియల్‌ ఎస్టేట్‌ పేరుతో ఘరానా మోసం
శంకర్‌ యాదవ్‌పై బెంగళూరులో పదుల సంఖ్యలో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. రియల్‌ ఎస్టేట్‌ పేరుతో వేలాది మందిని మోసం చేశారు. బెంగళూరులోని ఎస్సీ, ఎస్టీ స్థలాలను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించారు. దీంతో దేవనహల్లి పోలీస్‌ స్టేషన్‌లో శంకర్‌ యాదవ్‌పై 2018 మార్చి 18వ తేదీన 1719/2018, 1720/2018 నంబర్లతో రెండు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఒక్కో ప్లాటు రూ.50 లక్షలకు 35 మందికి అమ్మారు. ప్లాట్లు స్వాధీనం చేసుకునే సమయంలో ఎస్సీ, ఎస్టీలు భూములు తమవని రావడంతో విషయం బయటికొచ్చింది. కొనుగోలు దారులు శంకర్‌యాదవ్‌కు ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించలేదు. ఆఫీసు దగ్గరికి వెళ్లినా దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు.

శంకర్‌యాదవ్‌ బాధితులంతా గత సంవత్సరం మదనపల్లి ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి తూర్పారబట్టారు. దీంతో పాటు బెంగళూరులోని కన్సూమర్‌ ఫోరమ్‌లో 5 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. కేసు నంబర్‌ 1352/17, 1354/17లపై థర్డ్‌ డిస్ట్రిక్ట్‌ కన్సూమర్‌ ఫోరమ్‌ శాంతినగర్‌ బ్రాంచ్‌లో మరో రెండు కేసులు పెట్టారు బాధితులు. శంకర్‌ ఘరానా దొంగ అని వారు విమర్శించారు. చెమటోడ్చి సంపాదించిన సొమ్ములను దొంగిలించారని వాపోయారు.

మోసమే పెట్టుబడి
శంకర్‌ యాదవ్‌ మొదట్లో పినాకిని డెవెలపర్స్‌ వద్ద అకౌంటెంట్‌గా జాయిన్‌ అయ్యారు.  రెండు మూడు సంవత్సరాల తరువాత సొంతంగా ఐశ్వర్య బిల్డ్‌టెక్‌ పేరిట వ్యాపారం ప్రారంభించారు. మోసమే పెట్టుబడిగా అంచలంచెలుగా ఎదిగారు. భూమి కొనడం అభివృద్ధి చేసి.. ప్లాట్లుగా అమ్మడం అతని వ్యాపారం. అయితే శంకర్‌ యాదవ్‌ మాత్రం తనదికాని భూమిలో ప్లాట్లు వేయడం.. వినియోగదారులకు అమ్మడమే పని. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో ప్లాట్లు వేసి అమ్మి బెంగళూరులోని వందలాది మందిని ముంచేశారు. వారంతా ఒక శంకర్‌ బాధితుల సంఘంగా ఏర్పడి కోర్టుల్లో చీటింగ్‌ కేసులు పెట్టారు. పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ భూములను స్వాహా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు.

తప్పుడు అఫిడవిట్‌
శంకర్‌ యాదవ్‌ తనపై ఉన్న కేసులన్నీ దాచి ఎన్నికల అఫిడవిట్‌ ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశమైంది. పదుల సంఖ్యలో చీటింగ్‌ కేసులున్నా  ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని శంకర్‌యాదవ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. అయితే తన పరిధిలోకి రాదని ఆర్వో బదులివ్వడంతో కోర్టుకు వెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు.

శంకర్‌ యాదవ్‌పై బెంగళూరులో ఉన్న కేసులు..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top