హెచ్చరిక : గోద్రా ఘటన రిపీట్‌ అవుతుంది!

Karnataka BJP Minister Ravi Makes Sensational Comments on CAA Protests - Sakshi

సాక్షి, బెంగళూరు : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు పలు చోట్ల హింసాత్మకంగా మారుతుండటంతో కర్ణాటక బీజేపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మెజారిటీ ప్రజలు సహనం కోల్పోతే గోద్రా ఘటన వంటి పరిస్థితులు పునరావృతం అవుతాయని పర్యాటక శాఖ మంత్రి సీటీ రవి హెచ్చరించారు. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి యుటి ఖాదర్‌ గురువారం మంగుళూరులో  చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు మంత్రి కౌంటర్‌ ఇచ్చారు.ఈ మేరకు ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో శుక్రవారం వైరల్‌ అవుతున్నది.

ఆ వీడియోలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. చాలా చోట్ల రైళ్లు, బస్సులను దహనం చేస్తున్నారు. పోలీసులపై రాళ్లు విసిరి వారిని గాయపరుస్తున్నారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ప్రతీచోటా నిప్పు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలను దేశమంతా గమనిస్తోంది. ఈ దేశంలోని మెజారిటీ ప్రజలకు సహనమనేది ఒక బలం.  బలహీనత కాదు. మేం ఒక్కసారి సహనం కోల్పోతే ఏం జరుగుతుందో గత సంఘటనలను గర్తు తెచ్చుకోండి అంటూ వ్యాఖ్యానించారు.

మంగుళూరుకు చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఏఏ చట్టాన్ని ఎలా అమలు చేయాలో సోషల్‌ మీడియా నుంచి ప్రభుత్వానికి పలు సూచనలు వస్తున్నట్టు తెలిసింది. ఒక వేళ ముఖ్యమంత్రి యెడుయూరప్ప కర్ణాటకలో పౌరసత్వ చట్టాన్ని గనక అమలు చేస్తే మాత్రం రాష్ట్రమంతా భగ్గుమంటుందని హెచ్చరించారు. అయితే సీటీ రవి వ్యాఖ్యలపై మండిపడిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దినేష్‌ గుండూరావు మంత్రి వ్యాఖ్యలను భయపెట్టే, రెచ్చగొట్టేవిగా వర్ణించారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన మంత్రి మీద పోలీసులు కేసు పెట్టి కస్టడీలోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, సీఏఏపై ఆందోళనల నేపథ్యంలో మంగళూరులో ఇంటర్నెట్‌ సేవలన శనివారం సాయంత్రం వరకు నిలిపివేశారు.  చదవండి ఆ చట్టాన్ని వ్యతిరేకించేవారు పాక్‌ మద్దతుదారులు : కిషన్‌రెడ్డి

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top