
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లు తలపడ్డ కాంగ్రెస్, బీజేపీలకు మంగళవారం కౌంటింగ్ ట్రెండ్ చుక్కలు చూపించింది. ఇరుపార్టీల మధ్య క్షణక్షణానికి అధిక్యం మారిపోవడంతో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. చివరికి ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో జేడీఎస్ వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలుత ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది సేపటికే కాంగ్రెస్తో సమానంగా బీజేపీ ఓట్లు రాబడుతూ పోటీలో కొనసాగింది.
నువ్వా నేనా అన్నట్లుగా కాంగ్రెస్–బీజేపీ ఓట్ల లెక్కింపు సాగింది. ఒకానొక దశలో రెండు మూడు స్థానాలు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ బీజేపీ ముందుకు దూసుకుపోయింది. మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తి ఆధిపత్యం చూపడంతో ఆ పార్టీ నేతలందరూ సంతోషంలో మునిగిపోయారు. బెంగళూరులో పార్టీ ప్రధాన కార్యాలయం జగన్నాథ భవన్ వద్ద కార్యకర్తలు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటకల్లా 118 స్థానాల్లో బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. దీంతో బీజేపీ నేతలు సొంతంగా ప్రభుత్వ ఏర్పాటు చేసే ఆధిక్యం వచ్చిందనే ఆనందంతో రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఉధృతం చేశారు. అయితే వారి ఆనందం కొద్దిసేపటికే ఆవిరైంది. మధ్యాహ్నం రెండు తర్వాత బీజేపీ ఆధిక్యం అమాంతం పడిపోయింది. సాయంత్రం అయ్యేసరికి 104 స్థానాలకే పరిమితమై మ్యాజిక్ ఫిగర్కు 9 సీట్ల దూరంలో నిలిచింది. అలాగే ఉదయం ఓట్ల లెక్కింపులో గట్టి పోటీ ఇచ్చిన కాంగ్రెస్ మధ్యాహ్నానికి పూర్తిగా డీలా పడిపోయింది. ఆ తర్వాత కొంచెం పుంజుకుని చివరికి 78 స్థానాలకు పరిమితమైంది.