చంద్రబాబుపై కన్నా ఘాటు వ్యాఖ్యలు
టీడీపీ ప్రభుత్వానికి సిగ్గు, లజ్జా లేవు
స్టీల్ ప్లాంట్ ఇచ్చే బాధ్యత కేంద్రానిదే
ప్లాంట్ సాధ్యపడదని టీడీపీ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది
సాక్షి, ఢిల్లీ : చంద్రబాబు ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి సిగ్గు, లజ్జా లేవని, నిర్లజ్జగా అబద్ధాలతో ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. మోసపూరిత చర్యలతో ప్రజల ముందు బీజేపీని దోషులుగా నిలబెట్టాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రాణ త్యాగం చేస్తామన్న టీడీపీ నేతలు నాటకాలు ఆపాలంటూ హితవు పలికారు. ప్రజలను మోసం చేయడం ఆపి, ఇప్పుడైన నిజాలు చెప్పాలంటూ దుయ్యబట్టారు.
పునర్విభజన చట్టం ప్రకారం కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇచ్చిందని కన్నా తెలిపారు. కానీ రాష్ట్ర అధికారులు కడపలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని జూన్లో రిపోర్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. కానీ అమిత్ షా కారణంగా పట్టుబడంతో మరోసారి పరిశీలించాలంటూ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారంటూ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, మెకాన్ సంస్థ కలిపి నివేదిక అందచేస్తే కేంద్రం కూడా త్వరలోనే ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
కేంద్రం ఇచ్చిన ఆర్డర్లో ఎక్కడా కూడా ప్లాంట్ సాధ్యపడదు అని చెప్పలేదని, ఈ విషయం కేంద్రం ఇచ్చిన ఆర్డర్లో స్పష్టంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తెలుగుదేశం నిరాధార ఆరోపణల కారణంగా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని విమర్శించారు. తెలుగుదేశం నేతలు ఎవరు స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదన్నారు. పునర్విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కడపకు స్టీల్ ప్లాంట్ తీసుకువచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే నని కన్నా స్పష్టం చేశారు.
మరిన్ని వార్తలు