ఇదేం పిచ్చి బాబు!?

Kanna Lakshmi Narayana Fires on CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: చిత్తూరులోని దొడ్డిపల్లెలో జరిగిన పసుపు కుంకుమ సభ సందర్భంగా ప్రజలకు పంచిపెట్టిన భోజనంతోపాటు అప్పడాలపై సీఎం చంద్రబాబునాయుడు ఫొటోలు ముద్రించడంపై సోషల్‌ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు పేలుతున్నాయి. ప్రజలకు అందించిన తిండిపైనా నేతల ఫొటోలు ముద్రించి పబ్లిసిటీకి ఉపయోగించుకోవడమేంటని పలువురు మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఈ అంశంపై ట్విట్టర్‌లో సెటైర్లు సంధించారు. ‘ఆశ-దోచే-అప్పడం బాబు..! కుర్చీ మీద ఆశతో రాష్ట్రాన్ని దోచి ప్రచార పిచ్చితో ఆఖరికీ అప్పడాలపై, టిష్యూ పేపర్‌లపై, బాత్రూం కమోడ్లపై కూడా ప్రచారం చేసుకుంటున్నావ్! ఇదేం పిచ్చి బాబు!?’ అని నిలదీశారు.

కొంపదీసి శారదా స్కాం మీ హస్తముందా?
పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీ హైడ్రామా విషయంలో కేంద్రంపై విమర్శలు చేసిన చంద్రబాబుపైనా కన్నా మండిపడ్డారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు చంద్రబాబు అని నిలదీశారు. ‘కొంపతీసి 'శారదా స్కామ్'లో కూడా 'తమరి హస్తం' ఉందా?!? 'పచ్చ కామెర్లు' వాడికి లోకం 'పచ్చగా' కనిపిస్తుందని సామెత మీకు వర్తిస్తుంది’ అని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య దేశంలో దీదీ గుండాగిరి, చంద్రబాబు దాదాగారి మరెంతో కాలం సాగదని అన్నారు.

ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని కన్నా ప్రశ్నించారు. ‘కాకినాడలో మహిళలను ఫినిష్ చేస్తా అన్నప్పుడు ఏమైంది మీ ప్రజాస్వామ్యం? అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేని దూషించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం? సెక్రటేరియట్లో నాయీబ్రాహ్మణులను బెదిరించినప్పుడు ఏమైంది ప్రజాస్వామ్యం?’అని వరుస ట్వీట్లలో చంద్రబాబును కన్నా ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top