
సాక్షి ప్రతినిధి, చెన్నై: నటుడు కమల్హాసన్ ఫిబ్రవరి 21న కొత్త పార్టీని ప్రకటించనున్నారు. తన సొంతూరైన రామనాథపురంలో పార్టీని ప్రకటించిన అనంతరం రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ప్రకటనలో కమల్ తెలిపారు. ‘నటుడిగా నా అభివృద్ధికి కారకులైన తమిళ ప్రజానీకానికి కృతజ్ఞతలు. కృతజ్ఞతలు మాత్రమే కాదు, ప్రజలకు అంతకంటే ఎంతో చేయాల్సిన బాధ్యత ఉంది.
ఆ బాధ్యతలు నెరవేర్చడం కోసం నేరుగా ప్రజల వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని నేను పుట్టిన ఊరైన రామనాథపురం నుంచి వచ్చేనెల 21న ప్రారంభించబోతున్నాను. అదే రోజున పార్టీ పేరును, దాని లక్ష్యాలను ప్రకటించి, నా రాజకీయ ప్రస్థానాన్ని ఆరంభిస్తాను. రామనాథపురం, మధురై, దిండుగల్లు, శివగంగై జిల్లాల ప్రజలను కలుసుకుంటాను. ఇది నా దేశం, దీనిని కాపాడుకోవాలి అనే భావన నాకు మాత్రం ఉంటే సరిపోదు, మనమంతా కలిసి ఈ రాజకీయ రథాన్ని లాగడమే ప్రజాస్వామ్యం’అని కమల్ పేర్కొన్నారు.
కాలమే నిర్ణయిస్తుంది:రజనీ
కమల్ పార్టీని ప్రకటించడంపై నటుడు రజనీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ 1973లో హీరోగా నటించి నిర్మించిన ‘ఉలగం చుట్రు వాలిబన్’ సినిమా సీక్వెల్ యానిమేషన్ చిత్రం ప్రారంభ వేడుక బుధవారం చెన్నైలో జరిగింది. ఈ వేడుకలో కమల్, రజనీ పాల్గొని ఒకే వేదికను పంచుకున్నారు.