
సాక్షి, చెన్నై: తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ తన అభిమానులకు చేదువార్త అందించారు. తమ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తారని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్కు నిరాశ కలిగించే ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని బుధవారం ప్రకటించారు. తన తాజా చిత్రం ‘2.ఓ’ విడుదలైన తర్వాత మరోసారి అభిమానులతో సమావేశమవుతానని తెలిపారు. తాను ఏ రంగంలోకి దిగడం లేదని స్పష్టం చేశారు. రజనీకాంత్ ప్రకటనతో ఆయన రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహగానాలకు తెర దించినట్టైంది.
సినిమాల్లో అగ్రహీరోగా కొనసాగుతున్న రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని గత కొంతకాలంగా విస్తృత ప్రచారం జరుగుతోంది. అభిమానులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహించడం దీనికి బలం చేకూర్చింది. రజనీ రాజకీయాల్లోని ఖాయమని ఆయన సోదరుడు, సన్నిహితులు వెల్లడించడంతో ప్రచారం మరింత ఊపందుకుంది. అయితే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్టు రజనీకాంత్ ఎప్పుడూ స్పష్టంగా చెప్పలేదు. దీంతో ఆయన రాజకీయ ప్రవేశంపై రకరకాల ఊహగానాలు వెల్లువెత్తాయి. వీటన్నింటికీ తాజా ప్రకటనతో రజనీ ఫుల్స్టాఫ్ పెట్టారు. ‘2.ఓ’ సినిమా వచ్చే ఏడాదిలో విడుదలకానున్న నేపథ్యంలో మంగళవారం ఆయన మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. మరుసటి రోజే రాజకీయాల్లోకి రావడం లేదని ఆయన ప్రకటించడం విశేషం.