ప్రధాని మోదీకి అసలు పరీక్ష! | Gujarat assembly elections is real test for Narendra modi | Sakshi
Sakshi News home page

గుజరాత్‌ ఎన్నికలు మోదీకి అసలు పరీక్ష!

Oct 13 2017 3:32 AM | Updated on Aug 21 2018 2:39 PM

Gujarat assembly elections is real test for Narendra modi - Sakshi

డిసెంబర్‌లో జరిగే గుజరాత్‌ 14వ శాసనసభ ఎన్నికలు 2019 లోక్‌సభ ఎన్నికలకు ‘సెమీఫైనల్‌’గా పరిగణిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ గుజరాతీ కావడంతోపాటు 2014లో ప్రధానమంత్రి పదవి చేపట్టేవరకూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పన్నెండేళ్లకుపైగా పనిచేయడంతో అసెంబ్లీ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 1995 ఎన్నికల్లో అధికారం కోల్పోయిన కాంగ్రెస్‌ (1996 అక్టోబర్‌ 1998 మార్చి మధ్య బీజేపీ రెబల్‌ శంకర్‌సింహ్‌ వాఘేలా, ఆయన వర్గానికే చెందిన దిలీప్‌ పారిఖ్‌ సర్కార్లలో భాగస్వామ్యం మినహా) మళ్లీ పాతికేళ్ల తర్వాత ఆరోసారి అధికారం కోసం పోటీపడుతోంది. మోదీ తర్వాత సీఎం పదవిని మొదట ఆనందీబెన్‌ పటేల్‌, తర్వాత ప్రస్తుత సీఎం విజయ్‌ రూపాణీ చేపట్టాక రాష్ట్రంలో బలమైన ముఖ్యమంత్రి లేరనే భావన జనంలో ఉంది. రాష్ట్రంలో ఆధిపత్యవర్గమైన పాటీదార్లు(పటేళ్లు) రిజర్వేషన్‌ డిమాండ్‌తో బీజేపీకి దూరమయ్యారు. పాటీదార్‌ యువనేత హార్దిక్‌ పటేల్‌ బాహాటంగా కాంగ్రెస్‌ మద్దతిస్తుండగా, రాష్ట్ర జనాభాలో పదిపన్నెండు శాతమున్న పటేళ్లు బీజేపీని ఏ మేరకు అధికారంలోకి రాకుండా అడ్డుకుంటారనే విషయం ప్రశ్నార్ధకమే. గుజరాత్‌లో ఇటీవల దళితులపై జరిగిన దాడుల ఫలితంగా వారు కూడా జిగ్నేష్‌ మేవానీ అనే యువ నేత నేతృత్వంలో ఉద్యమించడం కూడా బీజేపీకి ఎన్నికల్లో ఎంత వరకు హాని చేస్తుందో చూడాలి.

పన్నెండేళ్ల క్రితం ముగిసిన కాంగ్రెస్‌ ‘ఖామ్‌’ ఫార్ములా!
1980, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్‌లో బీసీ జాబితాలో ఉన్న పెద్ద సామాజికవర్గం క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లింల(ఈ నాలుగు వర్గాలను కలిపి ఖామ్‌ అని పిలుస్తారు) మద్దతుతో కాంగ్రెస్‌ విజయం సాధించి వరుసగా పదేళ్లు పాలించింది. ఆ కాలంలోనే రిజర్వేషన్‌ వ్యతిరేక ఉద్యమాలు ఉవ్వెత్తున లేచి చివరికి మతఘర్షణలతో ముగిశాయి. 1990 అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ కాంగ్రెస్‌ సీఎం చిమన్‌భాయ్‌పటేల్‌ నాయకత్వాన జనతాదళ్‌-బీజేపీ సంకీర్ణం ఏడు నెలలకే ముగిసింది. చిమన్‌భాయ్‌ పార్టీని చీల్చి జేడీ(గుజరాత్‌) పేరుతో కాంగ్రెస్‌తో చేతులు కలిపి సంకీర్ణసర్కారు నడిపించారు. తర్వాత తన పార్టీని కాంగ్రెస్‌తో విలీనం చేశారు. 1994 ఫిబ్రవరిలో చిమన్‌భాయ్‌ మరణించాక ఆయన వారసునిగా కాంగ్రెస్‌ సీఎంగా చబీల్‌దాస్‌ మెహతా ఏడాదిపాటు కొనసాగారు.

మళ్లీ ఆరెసెస్‌ మూలాలున్న బీజేపీ క్షత్రియ నేత, గుజరాత్‌లో కాషాయపక్షం విస్తరణకు విశేషకృషిచేసిన శంకర్‌సింహ్‌ వాఘేలాను ఏడాదిపాటు సీఎం పదవిలో కొనసాగడానికి కాంగ్రెస్‌ సహకరించింది. వాఘేలాతో విభేదాలు వచ్చాక ఆయన స్థానంలో ఆయన పార్టీ గుజరాత్‌ జనతాపార్టీకి చెందిన దిలీప్‌ పారిఖ్‌ను గద్దెనెక్కించిన కాంగ్రెస్‌ నాలుగు నెలలకే  ఆయన సర్కారును కూలదోసింది. ఈ తరహా రాజకీయాల వల్ల కాంగ్రెస్‌ ప్రయోజనం పొందకపోగా బాగా నష్టపోయింది. చివరికి తాను తీవ్రంగా వ్యతిరేకించే కాషాయమూలాలు బలంగా ఉన్న వాఘేలా వంటి నేతలను చేర్చుకుని కాంగ్రెస్‌ పరువుపోగొట్టుకుంది. సెక్యులర్‌పార్టీగా ఇమేజ్‌ కోల్పోయింది.

మోదీ నాయకత్వం, 2002 మత ఘర్షణలతో బలోపేతమైన బీజేపీ!
బీజేపీ సీఎంగా రెండుసార్లు(1995, 2001) విఫలమైన బీజేపీ నేత కేశూభాయ్‌ పటేల్‌ 2001 అక్టోబర్‌లో రాజీనామా చేశాక అప్పటి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకూ ఎన్నికల్లో పోటీచేయని మోదీ తన శక్తియుక్తులతో రాష్ట్ర రాజకీయ చిత్రం శాశ్వతంగా మార్చేశారు. మోదీ గద్దెనెక్కిన ఐదు నెలలకే 2001 ఫిబ్రవరిలో జరిగిన గోధ్రా అల్లర్లు ఆయన ప్రతిష్టకు మాయనిమచ్చగా మారాయి. అయితే పది నెలలకే డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182కిగాను బీజేపీకి 127 సీట్లు(49.85 శాతం ఓట్లతో) సాధించడంతో మోదీ సుదీర్ఘ పాలనకు గట్టి పునాదిపడింది. 2012 డిసెంబర్‌ ఎన్నికల్లో వరుసగా మూడో విజయం ఆయనను బీజేపీ ప్రధాని అభ్యర్థిని చేసింది. గుజరాత్‌ అభివృద్ధి నమూనా పేరుతో దేశప్రధాని పదవిని చేపట్టి మూడున్నరేళ్లకు పైగా అధికారంలో కొనసాగుతున్న మోదీకి వచ్చే లోక్‌సభ ఎన్నికలకు దాదాపు ఏడాదిన్నర ముందు జరగబోతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు కీలకంగా మారాయి.

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇటీవలి గుజరాత్‌ పర్యటనల్లో జనం కనిపిస్తున్నా గెలుపుపై ఆ పార్టీకి నమ్మకం కనిపించడం లేదు. అదీగాక 20 ఏళ్లు కాంగ్రెస్‌లో కొనసాగి ఇటీవల రాజీనామా చేసిన వాఘేలా కనీసం నాలుగు జిల్లాల్లో కాంగ్రెస్‌ విజయావకాశాలను దెబ్బదీస్తారని భావిస్తున్నారు. పీవీ నరసింహారావు ప్రధాని పదవిలో ఉండగా 1994 డిసెంబర్‌లో జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాజయం పాలైంది. ఇప్పుడు మోదీకి సొంత రాష్ట్రంలో అంతటి ప్రమాదమైతే కనిపించడం లేదు. గుజరాత్‌ 57 ఏళ్ల చరిత్రలో 1975, 1990 ఎన్నికల్లో మాత్రమే ఏ పార్టీకి మెజారిటీరాని త్రిశంకు సభ ఏర్పడింది. 2001 అక్టోబర్‌ నుంచి కొనసాతున్న రాజకీయ సుస్థిరతను మోదీ నాయకత్వంలేని గుజరాత్‌ బీజేపీ వచ్చే ఎన్నికలో‍్ల విజయం ద్వారా కొనసాగిస్తుందా లేదా అనేది మూడు నెలల్లో తేలిపోతుంది.
- సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement