పచ్చ నేతల్ని ఏకిపారేసిన వంశీ | Sakshi
Sakshi News home page

చంద్రబాబు కాంగ్రెస్‌లోనే ఉన్నారా : వంశీ

Published Sat, Nov 16 2019 5:42 PM

Gannavaram MLA Vallabhaneni Vamsi Slams Chandrababu Naidu - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ నేతలు తనపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తనకు సలహాలు ఇచ్చిన టీడీపీ నేతలకు పుష్పాంజలి అని వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నా భాష, వేషం, మొరటుగా అనిపించి ఉండొచ్చు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసినప్పుడు నా నియోజకవర్గ సమస్యలు మాత్రమే చెప్పా. పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని సీఎం జగన్‌ను కోరాను. 

ఇంగ్లీష్‌ మీడియం నిర్ణయం తప్పేముందు. విద్యార్థి దశలో నాకు ఇంగ్లీష్‌ రాక ఇబ్బంది పడ్డా. పేద ప్రజలకు ఇంగ్లీష్‌ నేర్పితే తప్పేంటి. అబద్ధాలు చెప్తూ నాపై బురద జల్లుతున్నారు. నేను ఏమైనా వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చానా. విజయవాడ దుర్గగుడిలో క్షుద్రపూజలు చేశానా. టీటీడీ ఛైర్మన్‌ పదవి అమ్ముకున్నానా. హైందవ ధర్మాన్ని అన్యాయం చేశానా. చంద్రబాబుకు కాంగ్రెస్‌ రాజకీయ భిక్ష పెట్టింది. రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌లోనే చంద్రబాబు ఉన్నారా’అని ప్రశ్నల వర్షం కురిపించారు.

లోకేశ్‌ కూడా పదవికి రాజీనామా చేయాలి
‘నేనేమైనా విశాఖపట్నం పీఠం ముందు సీసీ కెమెరాలు పెట్టి.. స్వామీజీని కలవడానికి ఎవరెవరు వస్తున్నారోనని చెక్‌ చేశానా. వయసురిత్యా చంద్రబాబు కాళ్లకు దండం పెడితే.. దానికి కాళ్లు పట్టుకున్నానంటారా. సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని లోకేష్‌ అంటున్నారు. మరి లోకేష్‌ ఎందుకు ఎమ్మెల్సీ పదవిని అంటిపెట్టుకుని ఉన్నారు. టీడీపీ ఆరోపణలు గురువింద గింజప్పులా కనిపిస్తున్నాయి. మాపై దుష్ప్రచారం చేసే హక్కు మీకెరివచ్చారు. మేము జూనియర్‌ ఎన్టీఆర్‌ను తీసుకొచ్చామా. పబ్లిక్‌లో అనుకున్నదే చెప్పాం. ప్రజల్లో గెలవలనివారు, పెయిడ్‌ ఆర్టిస్టులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.

రాజేంద్రప్రసాద్‌ కూతురు పెళ్లికి రూ.25 లక్షలు ఇచ్చాను. మాల వేసుకున్నా. నన్ను ముందు దూషించింది రాజేంద్రప్రసాదే. నాకు పదవి ముఖ్యం కాదు. రాజీనామా చేస్తా. పార్టీ ఓడిపోయింది కాబట్టే లోకేశ్‌ కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలి. నీతులు మాకు చెప్పడమేనా.. మీకు వర్తించవా. నాపై చంద్రబాబులా ఓటుకు కోట్లు కేసు లేదు. నేను జగన్‌ను దొంగచాటుగా కలవలేదు. నా నియోజకవర్గ సమస్యలను చెప్పేందుకు కలిశా. నాకు చంద్రబాబులా తెలివితేటలు లేవు. అమ్మ చెబితే ఎన్టీఆర్‌పై కూడా పోటీ చేస్తానని చంద్రబాబు అనలేదా. ముఖానికి రంగులు వేసుకునేవాళ్లు రాజకీయాలకు పనికిరారని బాబు అనలేదా’అని ఎమ్మెల్యే వంశీ ప్రశ్నించారు.

Advertisement
Advertisement