రెండేళ్లలో 40 శాతానికిపైగా పెరుగుదల
2023–24లో వసూళ్ల లక్ష్యం రూ.564 కోట్లు
ఇప్పుడు ఆ మొత్తం రూ.797 కోట్లు
పన్నులు భారమైనా.. పెరగని మౌలిక సదుపాయాలు
వసూలు చేసిన పన్నుల ఖర్చుకు పంచాయతీలపై చంద్రబాబు సర్కార్ ఆంక్షలు
పారిశుధ్యం క్షీణించి పెరుగుతున్న అంటువ్యాధులు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రజలపై పన్నుల మోత మోగుతున్నా, సమస్యల వెత మాత్రం తీరడం లేదు. గత రెండేళ్లలో ఇంటి పన్నులు 40 శాతానికి పైగా పెంచి వసూళ్ల లక్ష్యాన్ని 40 శాతానికిపైగా పెంచిన చంద్రబాబు ప్రభుత్వం, అదే స్థాయిలో గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వసూలు చేసిన నిధుల వినియోగంపై ఆంక్షలు విధించడంతో పంచాయతీలు నిధుల కొరతను ఎదుర్కొంటుండగా, పారిశుధ్య నిర్వహణ క్షీణించి అంటువ్యాధులు పెరుగుతున్న పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది.
మోయలేని పన్ను భారాలు
జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరం 2023–24లో రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి పన్ను (బకాయిలు కాకుండా ఆ ఏడాది కొత్తగా నిర్ధారించిన) వసూలు లక్ష్యం రూ. 563.40 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆ మొత్తం ప్రతిపాదన రూ.797.03కు పెరిగింది. పెరిగిన ప్రతిపాదన పన్నులే రూ.233.63 కోట్లు. పాత ఇంటిపన్ను బకాయిలతో పాటుగ్రామాల్లో టాప్ కనెక్షన్లు, వ్యాపార షాపుల వసూలు చేసే ఇతర పన్నులు అన్నీ ఈ ఏడాది కొత్త ఇంటి పన్నులతో కలిపి ఏప్రిల్ ఒకటి నుంచి మొదలైన ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో గ్రామ పంచాయతీల ద్వారా మొత్తం పన్ను వసూలు లక్ష్యం రూ.1,233.99 కోట్లుగా పంచాయతీరాజ్ శాఖ నిర్ధారించింది.
మురుగుకాల్వల నిర్వహణ శూన్యం
గ్రామాల్లో మురుగుకాల్వల పన్నును కూడా ప్రభుత్వం ఇంటి పన్నులోనే కలిపి వసూలు చేస్తోంది. గత 2025–26 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రూ. 141.90 కోట్ల పాత బకాయిలతో కలిపి గ్రామ పంచాయతీల ద్వారా మొత్తం 799.22 కోట్లు ఇంటి పన్నులుగా వసూలు చేస్తే, అందులో 36.87 కోట్లు మురుగునీటి పన్ను పేరు చెప్పి ఇళ్ల యజమానుల నుంచి వసూలు చేసినవే. ప్రస్తుత 2026–27 ఆర్థిక సంవత్సరంలో ఈ మురుగు కాల్వ పన్ను రూ. 44.41 కోట్లు వసూలు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగంలో పన్ను వసూళ్లు భారీగా పెరుగుతున్నా మురుగు కాల్వల నిర్వహణ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీనివల్ల గ్రామాల్లో దోమలు ప్రబలుతున్నాయి. ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
టార్గెట్లతో వసూళ్లు... వ్యయాలపై సవాలక్ష ఆంక్షలు
గత 2025–26 ఆర్థిక సంవత్సరం గ్రామాల్లో ఇంటి పన్నులు వంద శాతం వసూలు చేయాల్సిందేనంటూ ప్రభుత్వం టార్గెట్లు విధించింది. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు రోజువారీ టార్గెట్లు పెట్టి బకాయిలతో కలిపి ఇంటి పన్ను పేరిట మొత్తం 799.22 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో రూ. 173.41 కోట్లు కలిపి మొత్తం రూ. 1,015 కోట్లు వసూలు చేసింది. కానీ, ఇంటి పన్నులుగా వసూలు చేసిన నిధులను ఆయా గ్రామ పంచాయతీలు తమ గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టుకోవడానికి మాత్రం ప్రభుత్వం సవాలక్ష ఆంక్షలను అమలు చేస్తోంది. దీంతో చేసిన పనులకు బిల్లుల పెట్టడానికి సైతం అధికారులు భయపడుతున్నారు.
ఇంటి పన్నులుగా వసూలు చేసిన నిధులు దాదాపు రూ. 800 కోట్ల జనరల్ ఫండ్ నిధులు ఆయా పంచాయతీల సీఎఫ్ఎంఎస్ ఖాతాల్లో మూలుగుతున్నా అభివృద్ధి పనులు మాత్రం చేపట్టడం లేదు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై నెలాఖరు వరకు నాలుగు నెలల కాలంలో మొత్తం 13,351 గ్రామ పంచాయతీలకు గాను కేవలం 951 గ్రామ పంచాయతీల్లో దాదాపు రూ. 54 కోట్ల పనులు మాత్రమే జరిగినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
బాదుడు పెరుగుతుందన్న ప్రభుత్వ సంకేతాలు!
పంచాయతీరాజ్ శాఖకు మంత్రిగా కొనసాగుతున్న ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ ఈ జూన్ 1న గ్రామాల్లో ఇంటి పన్నులపై నిర్వహించిన ఒక సమీక్ష సమావేశంలో గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను, తదితర పన్నులను సరిగ్గా వసూలు చేస్తే రూ. 5,496 కోట్ల ఆదాయం వస్తుందంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. పంచాయతీల్లో సొంత ఆదాయ వనరులు పెరగాలని, గ్రామ పంచాయతీల స్థాయిని బట్టి గ్రామాల్లో వివిధ ఇంటి పన్ను స్లాబ్స్లతో ట్యాక్సులు నిర్ధారించాలని ఆ సమావేశంలో పవన్కల్యాణ్ అధికారులకు సూచించారు. దీని ద్వారా రానున్న రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలపై పన్ను భారం మరింత పెరగనున్నట్టు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చిందని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇవ్వాల్సిందిపోయి.. గుంజుకుంటున్న సర్కార్
సాధారణంగా గ్రామ పంచాయతీలు ఇంటి పన్ను, ఇతర పన్నుల రూపంలో వసూలు చేసే నిధులను ఆయా పంచాయతీలు స్థానిక అవసరాలకు అనుగుణంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ, చంద్రబాబు ప్రభుత్వం గ్రామ పంచాయతీలు పన్ను రూపంలో వసూలు చేసే డబ్బులను వివిధ అవసరాలకు ప్రభుత్వానికి జమ చేయాలని ఆదేశాలిచ్చింది. గ్రామ పంచాయతీల్లో ఇళ్ల పన్నుగా వసూలు చేసిన మొత్తంలో ఒక శాతం ప్రభుత్వానికి విరాళం (కంట్రిబ్యూషన్)గా చెల్లించాలని జూలై 8న చంద్రబాబు ప్రభుత్వం జీవో జారీ చేయడం గమనార్హం. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ఖజానా నుంచి నిధులు మంజూరు చేయాల్సింది పోయి వాటి నుంచే డబ్బు లాక్కోవడం ఏమిటన్న విమర్శలు వినిపిస్తున్నాయి.



