4వ దశ లోక్‌సభ ఎన్నికలు: లైవ్‌ అప్‌డేట్స్‌

Fourth Phase Lok Sabha Elections Live Updates - Sakshi

నాలుగో దశ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు బిహార్‌లో 53.67 శాతం, జమ్ము&కశ్మీర్‌లో 9.79, శాతం, మధ్యప్రదేశ్‌లో 65.86 శాతం, మహారాష్ట్ర 51.06 శాతం, ఒడిశా 64.05 శాతం, రాజస్తాన్‌ 62.86 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 53.12 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 76.47 శాతం, జార్ఖండ్‌ 63.40 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అంచనా వేసింది. 

భారతీయ కుబేరుడు ముఖేష్‌ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దార్‌ రోడ్డులోని విల్లా థెరీసా హైస్కూల్‌లో ముఖేష్‌, ఆయన సతీమణి నీతా అంబానీ, కుమారులు ఆకాశ్‌, అనంత్‌, కుమార్తె ఇషా ఓటు వేశారు.

అన్సోల్‌ సిట్టింగ్‌ ఎంపీ, కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియోపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌ 199లోకి ప్రవేశించడమే కాకుండా పోలింగ్‌ ఏజంట్‌, బూత్‌లో ఉన్న ఎన్నికల అధికారిని బెదిరించాడనే ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. అన్సోల్‌ లోక్‌సభ స్థానం నుంచి సుప్రియో బీజేపీ తరపున మరోసారి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.

నాలుగో దశ ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల వరకు 50.6 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. బిహార్‌లో 44.33 శాతం, జమ్ము&కశ్మీర్‌లో 9.37, శాతం, మధ్యప్రదేశ్‌లో 57.77 శాతం, మహారాష్ట్ర 42.52 శాతం, ఒడిశా 53.61 శాతం, రాజస్తాన్‌ 54.75 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 45.08 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 66.46 శాతం, జార్ఖండ్‌ 57.13 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అంచనా వేసింది.

ఒడిషా : ఎన్నికల్లో బీజేపీ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బిజు జనతాదళ్‌ ఆరోపించింది. జైపూర్‌ పార్లమెంటరీ స్థానంలోని 12 పోలింగ్‌ కేంద్రాల్లో బీజేపీ గూండాలు చొరబడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని రాష్ట్ర సీఈఓకు ఫిర్యాదు చేసింది.

పశ్చిమ బెంగాల్‌లోని సేరంపూర్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తృణమూల్‌ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఓటర్లను బెదిరిస్తూ ఓటింగ్‌ శాతం పెరగకుండా టీఎంసీ గూండాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుపడుతున్నారని ఆరోపించారు.

నాలుగో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 3 గంటల వరకు 49.53 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. బిహార్‌లో 44.23 శాతం, జమ్ము&కశ్మీర్‌లో 8.42, శాతం, మధ్యప్రదేశ్‌లో 55.22 శాతం, మహారాష్ట్ర 41.15 శాతం, ఒడిశా 51.54 శాతం, రాజస్తాన్‌ 54.16 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 44.16 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 66.01 శాతం, జార్ఖండ్‌ 56.37 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అంచనా వేసింది.

ఎన్నికలు సజావుగా జరగకుండా బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. కేంద్ర బలగాలు బీజేపీ నాయకులతో చేరి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. బీజేపీ ఎంపీ బాబుల్‌ సుప్రియో పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లి ప్రిసైడింగ్‌ ఆఫీసర్లు, ఓటర్లపై బెదిరింపులకు దిగారని ఈసీకి ఇచ్చిన లెటర్‌లో పేర్కొంది.  కాగా,పశ్చిమ బెంగాల్‌ బిర్‌భూమ్‌ జిల్లాలోని ననూర్‌లో  పోలింగ్‌ కేంద్రాల వద్ద బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తలను అడ్డగించటంతో అక్కడ పశ్చిమ బెంగాల్‌ బిర్‌భూమ్‌ జిల్లాలోని ననూర్‌లో ఉద్రిక్తత తలెత్తింది. టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.

నాలుగో దశ ఎన్నికల్లో  మధ్యాహ్నం 2 గంటల వరకు 38.63 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ ప్రకటించింది. తొమ్మిది రాష్ట్రాల్లోని 72 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బిహార్‌లో 37.71 శాతం, జమ్ము&కశ్మీర్‌లో 6.66, శాతం, మధ్యప్రదేశ్‌లో 43.44 శాతం, మహారాష్ట్ర 29.93 శాతం, ఒడిశా 35.79 శాతం, రాజస్తాన్‌ 44.62 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లో 34.42 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 52.37 శాతం, జార్ఖండ్‌ 44.90 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎన్నికల కమిషన్‌ అంచనా వేసింది.

క్రికెట్‌ మాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  పోలింగ్‌ సెంటర్‌ 203లో సచిన్‌, ఆయన సతీమణి అంజలీ, కుమారుడు అర్జున్‌, కూతురు సారా ఓటు వేశారు. బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. 

షారుఖ్‌ ఖాన్‌ తన కుటుంబంతో కలిసి ముంబైలోని బాంద్రాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  షారుఖ్‌‌, ఆయన సతీమణి గౌరీఖాన్‌ ఓటు వేశారు. పోలింగ్‌ సెంటర్‌ 283లో ఆయన ఓటు వేశారు. ముంబైలోని జుహు పోలింగ్‌ కేంద్రంలో బాలీవుడ్‌ నటులు అమితాబ్‌ బచ్చన్‌, జయ బచ్చన్‌, అభిషేక్‌ బచ్చన్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ వివేక్‌ ఒబేరాయ్‌ తన తండ్రి సురేష్‌ ఒబేరాయ్‌తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. జుహులోని గాంధీగ్రామ్‌ పాఠశాలలో వారు ఓటు వేశారు.

హీరో రణ్‌వీర్‌ సింగ్‌ తన తండ్రితో కలిసి బాంద్రాలో ఓటు వేశారు. హీరోయిన్‌ కరీనా కపూర్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్‌ స్టార్ హృతిక్‌ తన కుటుంబం సభ్యులతో కలసి ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌ బిర్‌భూమ్‌ జిల్లాలోని ననూర్‌లో టీఎంసీ మహిళా కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బీజేపీ కార్యకర్తలు టీఎంసీ కార్యకర్తలను అడ్డగించటం ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో టీఎంసీ మహిళా కార్యకర్తలు కర్రలు చేతబూని ఆందోళనకు దిగారు. కేంద్ర బలగాలు అందుబాటులో లేకపోవటంతో పోలీసు సిబ్బందే పరిస్థితిని చక్కబెడుతున్నారు.

పశ్చిమ బెంగాల్‌ అసన్‌సోల్ నియోజకవర్గంలో టీఎంసీ కార్యకర్తలు ఓ మహిళా రిపోర్టర్‌పై దాడికి పాల్పడ్డారు. మైకును లాక్కొని ఆమెపై చేయి చేసుకున్నారు. బాలీవుడ్‌ తారలు అజయ్‌ దేవ్‌గణ్‌, కాజల్‌ దంపతులు, అనుపమ్‌ ఖేర్‌, ప్రియాదత్‌ గేయ రచయిత గుల్జర్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 9 గంటల వరకు బీహార్‌ 10.75 శాతం, మధ్యప్రదేశ్‌ 10.09 శాతం, మహారాష్ట్ర 4.09 శాతం, ఒడిశా 9 శాతం, రాజస్తాన్‌ 7.57 శాతం, యూపీ 8.05శాతం, పశ్చిమ బెంగాల్‌ 16.74 శాతం, జార్ఖండ్‌ 10.94 శాతం పోలింగ్‌ నమోదైంది. బాలీవుడ్‌ నటీమణులు భాగ్య శ్రీ, సోనాలీ బింద్రే  ముంబైలోని విలే పార్లేలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు, మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమిర్‌ఖాన్‌ ఆయన సతీమణి కిరణ్‌రావ్‌ ముంబై బాంద్రాలోని అన్నెస్‌ హైస్కూల్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీనియర్‌ నటి మాధురీ దీక్షిత్‌ జుహులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ ఛైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ పెద్దర్‌ రోడ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పశ్చిమ బెంగాల్లోని పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీఎంసీ, బీజేపీ, వామపక్ష కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన భద్రతా దళాలు వారిని చెదరగొట్టాయి. కేంద్ర మంత్రి, అసన్సోల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి బబుల్‌ సుప్రియో కారుపై కొంతమంది టీఎంసీ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు.

అంతకు క్రితమే ఆయన మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌ ఓటర్లు చైతన్య వంతులయ్యారని, కేంద్ర భద్రతా బలగాలు లేనిదే ఓటు వెయ్యమని చెప్పటం శుభసూచకమని పేర్కొన్నారు. భద్రతా బలగాలు లేని చోటుకు తాను స్వయంగా కే్ంద్ర బలగాలను తీసుకువెళతానని చెప్పారు. ఓటర్ల చైతన్యాని చూసి మమతా బెనర్జీ భయపడుతోందని అన్నారు. కాశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. కుల్‌గామ్‌లోని కురిగామ్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటర్లు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌ ఝాన్సీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అనురాగ్‌ శర్మ.. ఝాన్సీలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సీపీఐ బెగుసరయ్‌ ఎంపీ అభ్యర్థి, విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్‌ బెగుసరయ్‌లోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెగుసరయ్‌ని పాడుచేసే వారికి ఓటమి తప్పదని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి గిరిరాజ్‌ సింగ్‌కు పోటీగా కన్షయ్య నిలబడిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌ నాథ్‌ సికర్‌పూర్‌లోని పోలింగ్‌ బూత్‌ నెం 17లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నార్త్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థి, సినీ నటి ఉర్మిళ మతోండ్కర్‌ బాంద్రాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లా శాంతిపూర్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో నాటు బాంబు కలకలం రేపింది. పోలింగ్‌ కేంద్రంలో ఇలా నాటు బాంబు దర్శనమియ్యటంతో ఓటర్లు భయాందోళనకు గురవుతున్నారు. ఇంటర్నేషనల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా  తల్లి మధు చోప్రాతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ పరేశ్‌ రావల్‌ దంపతులు విలే పార్లీలోని జమ్నా బాయి స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బాలీవుడ్‌ సీనియర్‌ నటి రేఖ బాంద్రాలోని బూత్‌ నెంబర్‌ 283లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గోరఖ్‌పూర్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి, ప్రముఖ నటుడు రవి కిషన్‌ గురుగావ్‌లోని ఓ పోలింగ్‌ బూత్‌ వద్ద క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్దకు నడవలేని వారికి అక్కడి పోలింగ్‌ పర్సనల్స్‌ సహాయమందిస్తున్నారు.

రాజస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకురాలు వసుంధర రాజే సింధియా జల్‌వార్‌లోని పోలింగ్‌ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముంబై నార్త్‌ సెంట్రల్‌ బీజేపీ ఎంపీ అభ్యర్థి పూనమ్‌ మహాజన్‌ ఓర్లిలోని బూత్‌ నెం48లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఓటు వేయడానికి పెద్దర్‌ రోడ్‌లోని పోలింగ్‌ కేంద్రం వద్ద క్యూలో నిల్చుని ఉన్నారు.

ప్రముఖ వ్యాపార వేత్త అనిల్‌ అంబానీ ముంబై కఫ్పే పెరడ్‌లోని జీడీ సోమని స్కూల్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి, నవాడా సిట్టింగ్‌ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. లకిసరయ్‌ జిల్లా బరహియాలోని బూత్‌ నెం 33లో ఓటు వేశారాయన. ఓటు వేయడానికి పూర్వమే ఆయన బరహియాలోని శక్తిదామ్‌లో పూజలు నిర్వహించారు.

దేశవ్యాప్తంగా నాలుగో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మహారాష్ట్రలోని 17, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌ల్లో 13 చొప్పున, పశ్చిమబెంగాల్‌లో 8, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో 6 చొప్పున, బిహార్‌లో 5, జార్ఖండ్‌లోని 3 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరగనుంది. వీటితో పాటు జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ నియోజకవర్గంలో రెండో దశ (మొత్తం మూడు దశలు) పోలింగ్‌ జరగనుంది.

ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. కేంద్రమంత్రులు గిరిరాజ్‌ సింగ్, సుభాష్‌ బమ్రే, ఎస్‌ఎస్‌ అహ్లూవాలియా, బాబుల్‌ సుప్రియోతో పాటు కాంగ్రెస్‌ ప్రముఖులు సల్మాన్‌ ఖుర్షీద్, సినీనటి ఊర్మిళ మతోండ్కర్, సీపీఐ తరఫున కన్హయ్య కుమార్‌ తదితర 961 అభ్యర్థుల భవితవ్యంపై 12.79 కోట్ల మంది ఓటర్లు తమ నిర్ణయం ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top