
బెంగళూరు: తనను సీఎంను చేయడం తన తండ్రి హెచ్డీ దేవెగౌడకు ఇష్టం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తెలిపారు.ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ మద్దతు ఇస్తామని ప్రకటించినప్పుడు సీఎం పదవిని మీరే ఉంచుకోండని దేవగౌడ కాంగ్రెస్ నేతలకు సూచించారని పేర్కొన్నారు. అయితే, వారు మాత్రం సీఎంగా తనకే ఓటు వేశారని తెలిపారు.
‘ నాకు ఆరోగ్యం పరంగా సమస్యలు ఉన్నాయి. గతంలో రెండు సార్లు గుండె ఆపరేషన్ అయింది. ఇదే విషయాన్ని మా తండ్రి కాంగ్రెస్ నేతలకు చెప్పారు. సీఎం పదవిని మీ వద్దే ఉంచుకోండని కాంగ్రెస్ నేతలను కోరారు. కానీ వారు మాత్రం నన్ను సీఎంను చేశారు’ అని కుమారస్వామి చెప్పుకొచ్చారు.
‘ఒక్కొసారి ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపగలనా అని భయమేస్తోంది. ఎందుకంటే విధానసభలో ఓ మధ్యవర్తి అధికారుల బదిలీల కోసం రూ.10 కోట్లు అడుగుతున్నట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడపగలనా అనే అనుమానం కలుగుతుంది’ అని పేర్కొన్నారు. కాగా తనకు డబ్బు అవసరంలేదని, ఇతరవాటిపై ఆశలు లేవని, ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని కుమారస్వామి పేర్కొన్నారు