‘వారి వల్ల వ్యాపారులు భయ భ్రాంతులకు గురవుతున్నారు’

Daggubati Purandeswari Comments Over TRS Leaders - Sakshi

సాక్షి, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల కారణంగా వ్యాపారులు భయ భ్రాంతులకు గురవుతున్నారని బీజేపీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. గురువారం ఖమ్మంలో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ నాయకులు పువ్వాడ అజయ్‌, నామా నాగేశ్వరరావు ప్రజల కోసం పనిచేయకుండా స్వలాభం కోసం పనిచేస్తున్నారన్నారు. వ్యాపారాలు చేసుకునే నామా నాగేశ్వరరావు ఎక్కువ రోజులు హైదరాబాద్‌లోనో, బయటో ఉంటారని పేర్కొన్నారు. కానీ బీజేపీ అభ్యర్థి శారద ఖమ్మం బిడ్డ అని, లోకల్‌లో అందుబాటులో ఉంటారని తెలిపారు. నాలుగున్నరేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ హామీల అమలులో పూర్తిగా విఫలమైందని అన్నారు.

భావ సారూప్యత లేని వారందరూ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డారని, సిద్ధాంతం లేని మహాకూటమి లాంటి వారు ప్రజలకు ఏవిధంగా సుపరిపాలన అందిస్తారని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్‌ను తిట్టిన చంద్రబాబు నేడు కాంగ్రెస్‌తో ఎలా అపవిత్ర పొత్తు పెట్టుకున్నారు అని చురకలంటించారు. సేవాభావంతో పాలన చేసే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ అభ్యర్థి శారద ఖమ్మంని అభివృద్ధి చేస్తుందని హామీ ఇచ్చారు. సీబీఐ విషయంలో కేంద్రం ఎటువంటి జోక్యం చేసుకోలేదని, బ్యాంకులలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారి మీద మాత్రమే ఈడీ దాడులు చేస్తుందని తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top