టీఆర్ఎస్ ఎంపీలను సస్పెండ్ చేశారా?
తెలంగాణ ప్రభుత్వానికి మల్లు రవి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కూని చేసిందని టీపీసీసీ నేత మల్లు రవి విమర్శించారు. శాసన సభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు అణిచివేస్తున్నారని, ఈ రోజు బ్లాక్ డే అని ఆయన అన్నారు. మంగళవారం గాంధీభవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ బస్సు యాత్ర విజయవంతం కావడంతో సమస్యలపై అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతో టీఆర్ఎస్ నేతలు ఈ నాటకాన్ని సృష్టించారని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో గొడవ చేస్తున్నా అక్కడ సభను వాయిదా వేశారే తప్ప ఇక్కడిలా సస్పెండ్ చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ సభ్యుల సస్పెండ్తో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రజా పరిరక్షణ దీక్ష చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.