హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీని విడిచి వెళ్లడం చాలా బాధాకరమని కాంగ్రెస్ ఎంపీ, క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి అన్నారు. జీవన్ రెడ్డి క్రమశిక్షణతో పని చేశారని, ఆయన పార్టీలోనే ఉంటే బాగుండేదని చెప్పారు. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలని అన్నారు.
‘పార్టీలో ఉండి అడగాలి. కొన్ని రాజకీయ సమీకరణాల వల్ల చాలా మందికి పదవులు రావడం లేదు. కాంగ్రెస్ పార్టీ గొప్ప సిద్ధాంతాలు ఉన్న పార్టీ. అలాంటి పార్టీ దేశంలో ఇంకొకటి లేదు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా, తెలంగాణ ప్రజల అవసరాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి అద్భుతమైన పాలన చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి మంచి ప్రజాదరణ ఉన్న నాయకుడు, గొప్ప వ్యూహకర్త. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కాంగ్రెస్ చేసిన కృషిని ఈ దేశం ఎన్నడూ మరిచిపోదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సిద్ధాంతాలను ఆచరిస్తూ హామీలను అమలు చేస్తూ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారు.
కులగణన, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలను విజయవంతంగా అమలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల ఆధారంగా రాజకీయాలు చేసిన నాయకుడు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలాంటి అవకాశాలు ఇచ్చినప్పుడు ఆయన బాగా పని చేశారు. జీవన్ రెడ్డిలాంటి క్రమశిక్షణతో ఉన్న నాయకుడు పార్టీని వీడడం బాధాకరం. ప్రభుత్వం పటిష్ఠమైన పాలన చేయాలంటే కొంత సర్దుకుపోవాలి. నాకు కూడా అవకాశాలు చాలా మిస్సయ్యాయి.
నేను పార్టీలోనే ఉండి పోరాటం చేశాను. జీవన్ రెడ్డి మనసు మార్చుకొని పార్టీలో కొనసాగాలి. పరిస్థితులను బట్టి నాయకులకు అవకాశాలు వస్తాయి. వేచి చూడాలి.. మంచి నాయకులకు మంచి అవకాశాలు తప్పకుండా వస్తాయి. జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రిగా సుదీర్ఘ కాలం పాటు రాజకీయాలు చేసిన అనుభవం ఉంది. ఆయన లాంటి వారు ఓపికగా రాజకీయాలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు అండగా ప్రజాపాలనకు సహకారాన్ని అందిస్తే బాగుండేది’ అని చెప్పారు.


