
సాక్షి, హైదరాబాద్: మిషన్ భగీరథ పథకం పేరిట దేశంలోనే పెద్ద స్కామ్ జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ పథకంపై న్యాయ విచారణ జరగాలని డిమాండ్ చేశారు. 'మిషన్ భగీరథ పర్దాకే పీచే క్యా హై.. ప్రజలకు తెలియాలి' అని ఆయన వ్యాఖ్యానించారు. తాగునీరు పేరుతో తెలంగాణ ప్రభుత్వం రూ. 40వేల కోట్ల అవినీతికి పాల్పడుతోందని విమర్శించారు. మిషన్ భగీరథ పైప్లైన్లు వేయడం కోసం గ్రామీణ రోడ్లను అడ్డుగోలుగా తవ్వేశారని మండిపడ్డారు. మిషన్ కాకతీయతో చెరువులన్నీ నిండినప్పుడు ఇంకా భగీరథ పథకం అవసరమేంటని ఆయన ప్రశ్నించారు.
కమిషన్ల కోసమే ఆంధ్ర గుత్తేదారులకు భగీరథ పనులు అప్పగించారని అన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలు ఎటుపోయాయని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీల నిధులను మళ్లించి ఆ వర్గాలను మోసం చేస్తున్నారని విమర్శించారు.