టీడీపీని రీడిజైన్ చేస్తాం..
పార్టీలో పునరుత్తేజం తెస్తాం
హైదరాబాద్ నుంచి టెలీకాన్ఫరెన్స్లో చంద్రబాబు
సాక్షి, అమరావతి: రానున్న కాలంలో అన్ని స్థాయిల్లో టీడీపీని రీడిజైన్ చేస్తామని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. పార్టీలో పునరుత్తేజం తెస్తామని, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని తెలిపారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి శుక్రవారం ఏపీలోని మండల స్థాయి టీడీపీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
► మరో రెండేళ్లలో టీడీపీ 40 ఏళ్లకు చేరుతుంది.
► పార్టీ అధికారంలోకి రాగానే తప్పుడు కేసులకు కారణమైన వారిపై విచారణ చేయిస్తాం. అక్రమ కేసులన్నీ రద్దు చేస్తాం.
► రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపైనే మహానాడు నిర్వహిస్తున్నాం.
► ప్రకాశం దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి.
► రైతు భరోసా కింద ఐదేళ్లకు ఒక్కో రైతుకు ఇస్తోంది రూ.37,500 మాత్రమే. ఒక్కో రైతుకు ఏడాదికి ఆరు వేలు ఎగ్గొట్టడం రైతు భరోసా ఎలా అవుతుంది? ఐదేళ్లకు రూ.30 వేలు ఎగ్గొడుతున్నారు.
► టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే అన్నదాత సుఖీభవ కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ఒక్కో రైతుకు ఐదేళ్లలో రూ.75 వేలు వచ్చేవి. నాలుగు, ఐదు రుణ మాఫీ కిస్తీలు రూ.40వేలు వచ్చేవి. ఒక్కో రైతుకు లక్షా 15 వేలు వచ్చేవి.
► మొత్తం రాష్ట్రాన్నే వైఎస్సార్సీపీ హోల్సేల్గా అమ్మేస్తోంది.