దోపిడీ బాబు నీతులు చెప్పడమా?
మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజం
దేశ పటంలో రాష్ట్ర రాజధాని అడ్రస్సే లేకుండా చేశారు
చంద్రబాబు తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది
సాక్షి, అమరావతి: ఐదేళ్ల పాలనతో దేశ పటంలో రాష్ట్ర రాజధాని అడ్రస్ కూడా లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు సిగ్గూ ఎగ్గూ లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు నీతులు చెబుతుండడం హేయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి లేక వలసపోయిన భవన నిర్మాణ కార్మికుల గురించి ఒక్కరోజైనా మాట్లాడని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని తప్పుబడుతూ రాద్ధాంతం చేయడం శోచనీయమన్నారు. బొత్స సత్యనారాయణ మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో మంత్రిగా వైభోగం అనుభవించిన సుజనా చౌదరి రాష్ట్ర రాజధాని విషయంలో చంద్రబాబు తోకలా వంతపాడటం అనైతికమని పేర్కొన్నారు. తమ నేత వైఎస్ జగన్పై వ్యక్తిగత దూషణలకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు. జాతీయ బాలల దినోత్సవం నవంబర్ 14న ఇసుక సమస్యపై చంద్రబాబు దీక్ష తలపెట్టడాన్ని బొత్స ఆక్షేపించారు.
బాబు ఒక్క ఇల్లయినా ఇచ్చారా?
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఏం మేలు చేశారో చెప్పాలని బొత్స నిలదీశారు. టీడీపీ పాలనలో కూలీల వలసలు భారీగా పెరిగాయని గుర్తుచేశారు. బలహీనవర్గాల ఇళ్లకు బిల్లులు ఇవ్వొద్దని జీఓ జారీ చేశారని, దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయని తెలిపారు. బాబు కనీసం ఒక్క ఇల్లయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల గురించి చంద్రబాబు మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని అన్నారు.