బీసీని సీఎం అభ్యర్థిగా  ప్రకటించాలి: జాజుల

Announcing BC as CM candidate: Jazula - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బీసీల ఓట్లు కావాలంటే బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి బహిరంగ లేఖ రాశారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పుకునే కాంగ్రెస్‌.. టికెట్ల కేటాయిం పులో బీసీలకు అన్యాయం చేసిందని, ఆ అన్యాయా న్ని సరిదిద్దాలంటే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించాలని పేర్కొన్నారు. శుక్రవారం మేడ్చల్‌లో జరగనున్న సోనియా గాంధీ బహిరంగ సభలో ఈ మేరకు హామీనివ్వాలని ఆయన కోరారు.

అలాగే చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాం«ధీ హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ రెండు హామీలు ఇస్తేనే రాష్ట్రం లో కాంగ్రెస్‌కు బీసీల మద్దతు ఉంటుందన్నారు. లేని పక్షంలో తమిళనాడు, బిహార్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల తరహాలో తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కు చేదు అనుభవం ఎదురవుతుందని హెచ్చరించారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేస్తున్న ఆర్‌.కృష్ణయ్యని ఉద్దేశిస్తూ చట్ట సభల్లో బీసీల రిజర్వేషన్లపై తనకు రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారని చేసిన ప్రకటనను నిలుపుకోవాలన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top